మహబూబ్నగర్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అమరచింత : ప్రముఖ గాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతకు చెందిన సాయిచంద్ తన తండ్రి అడుగుజాడల్లో పేద ప్రజల గొంతుకై తన పాటతో ఉద్యమానికి ఊపునిచ్చారు. అంతటి గాన కోయిల మరణ వార్త ఉమ్మడి జిల్లాను షాక్కు గురి చేసింది. సాయి ఇక లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అమరచింతతోపాటు పలు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న తండ్రి వెంకట్రాములు హుటాహుటిన తెల్లవారుజామునే హైదరాబాద్కు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మారుమూల పల్లెటూరులో జన్మించిన సాయి అంచెలంచెలుగా ఎదిగి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతోపాటు ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సన్నిహితుడిగా మెలిగేవారు.
తన పాట ఆటతో సభికులను ఆకట్టుకొని విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ పాడిన పాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి. అంతటి యోధుడి మరణంతో ఉమ్మడి జిల్లా కన్నీటి పర్యంతమైంది. ఎక్కడ చూసినా ఆయన చిత్రపటాలకు నివాళులర్పిస్తూ పార్టీలకతీతంగా కొనియాడారు. అమరచింత శోకసంద్రంలో మునిగిపోయింది. మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లోని గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేసుకున్నారు.
పార్థివదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం జరిగిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి నివాళి అర్పించారు. వనపర్తిలో క్యాంపు కార్యాలయంలో సాయి చిత్రపటానికి మంత్రి నిరంజన్రెడ్డి పూలమాలలు వేశారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆయన సతీమణి సుచరిత గచ్చిబౌలిలోని కేర్ దవాఖానకు చేరుకొని బోరున విలపించారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి , జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామిరెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని కళాకారులు ప్రధాన కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అస్వస్థతకు గురైన నిమిషాల్లోనే…
సాయి భార్య రజినీతో కలిసి బుధవవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బిజినపల్లి మండలం కారుకొండ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా కుమ్మెర గట్టుపై ఉన్న శివుడిని దర్శించుకోవాలని కుటుంబ సమేతంగా వచ్చారు. అయితే వచ్చిన కొద్ది సేపటికే ఛాతిలో నొప్పి రాగా.. సీపీఆర్ చేయించుకున్నాడు. తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్నా.. 12:30 గంటల పారతంలో మళ్లీ ఛాతిలో నొప్పి ఎక్కువగా రావడంతో భార్యకు తెలిపాడు. వెంటనే గన్మెన్ సాయంతో నాగర్కర్నూల్ గాయత్రి దవాఖానకు తరలించారు. సాయిచంద్ అస్వస్థతకు గురైన విషయాన్ని బీఆర్ఎస్ నేత జక్కా రఘునందన్రెడ్డికి సమాచారం అందించారు. హుటాహుటిన రాత్రి దవాఖానకు వెళ్లి వైద్యులను అప్రమత్తం చేశారు. చికిత్స ప్రారంభించినా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. అయితే తన భర్త మరణించలేదని, హైదరాబాద్కు రెఫర్ చేయాలని ఆమె కోరడంతో గచ్చిబౌలిలోని కేర్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి మరణించినట్లు ధ్రువీకరించారు.
పాటలతో ఉర్రూతలూగించి..
ఉద్యమ గాయకుడైన సాయిచంద్కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు ఎక్కువ సమయం కేటాయిస్తూ అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించేవారు. జూన్ 6న నాగర్కర్నూల్లో, 12న జోగుళాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఆటాపాటలతో ఆకట్టుకున్నారు. 8న జడ్చర్లలో కేటీఆర్ సభలో కూడా సాయి తన గానంతో ఆకట్టుకున్నారు. మిషన్ భగీరథ, పాలమూరు పచ్చబడిన వైనంపై ఆయన పాడిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పాల్గొని తన పాటతో కన్నీళ్లు పెట్టించారు. వనపర్తికి సాగునీరు ఎలా తెచ్చారో వివరిస్తూ పాడిన పాటకు మంత్రి మైమరిచిపోయారు.
సాయిచంద్ కుటుంబ నేపథ్యం.
1984 ఏడాది సెప్టెంబర్లో వీద మణెమ్మ, వెంకట్రాములు దంపతులకు సాయిచంద్ రెండో సంతానం. తర్వాత తల్లి, అన్న క్రాంతికుమార్ మరణించారు. అతడి తండ్రి సహకారంతో సాయిచంద్ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకటి నుంచి 5వరకు అమరచింత లిటిల్ ఫ్లవర్లో, 6 నుంచి 10 వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. తర్వాత ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 2011లో కారుకొండకు చెందిన తోటి కళాకారిణి రజినిని వివాహం చేసుకోగా.. వీరికి చెర్రీస్ (9), మీనన్(6) సంతానం. 2021లో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు అరుణోదయ విప్లవ సమాఖ్యలో క్రియాశీలక సభ్యుడు. గద్వాల ఆర్టీసీ డిపోలో ఉద్యోగాన్ని మానేసి ప్రజాపంతా పార్టీలో చేరారు. కమ్యూనిస్టు భావాలతో కళాకారుడిగా గుర్తింపు పొందారు. తండ్రి బాటలోనే సాయి అడుగులు వేశాడు.