కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.1800 కోట్ల వ్యయం కానుండగా.. తొలి విడుతలో రూ.400 కోట్లతో ప్రారంభమైన పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెండింగ్ భూసేకరణలో జాప్యాన్ని తగ్గించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. దీంతో వచ్చే సంవత్సరంలోగా తిరుపతి ప్రయాణికులకు దూరభారం తగ్గనున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి (167కే) పనులు చకచకా సాగుతున్నాయి. పనులు వేగంగా పూర్తి చేసేలా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.1,800 కోట్ల భారీ నిధులతో పనులు చేపట్టనున్నారు. తొలి విడుతలో రూ.400 కోట్ల విలువైన పనులను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి పనులను పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే ఏపీ (రాయలసీమ)తోపాటు తెలంగాణను మరింత దగ్గర చేయనున్నది. కల్వకుర్తి మండలం కొట్ర నుంచి ఈ రోడ్డు ప్రారంభమవుతున్నది. ఇలా 173 కిలోమీటర్ల దూరంలో నంద్యాల వరకు జాతీయ రహదారి నూతనంగా నిర్మాణం కానున్నది. ఈ పనుల్లో భాగంగా 10 మీటర్ల వెడల్పుతో బీటీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇలా మూడు వరుసల్లో రోడ్డు ఉండనున్నది. ఇక కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ కేంద్రాల్లో నాలుగు వరుసలతో పాటుగా రోడ్డుకు ఇరువైపులా పేవ్మెంట్ వే పనులు చేపడతారు. అలాగే పది చోట్ల బైపాస్, సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ రోడ్లను ఇరువైపులా విస్తరిస్తున్నారు. గోతులు లేకుండా, ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాన్ని మట్టి, కంకరతో నింపి, రోడ్డు రోలర్తో చదును చేసి ఆ పైన బీటీ వేస్తున్నారు. అలాగే అక్కడక్కడా చిన్న కల్వర్టులు, బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. రోడ్డు మొత్తం సమాంతరంగా ఉండేలా ఈ పనులను చేపడుతున్నారు.
అదే విధంగా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద ఐకానిక్ వంతెన (తీగల బ్రిడ్జి) నిర్మించనుండటం గమనార్హం. రూ.600 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా వారధిని నిర్మించనున్నారు. ఈ పనులు రాబోయే ఎండాకాలంలో ప్రారంభించే అవకాశం ఉన్నది. కృష్ణానదికి వరద లేకపోవడంతో పాటుగా సామశిల-సిద్ధేశ్వరం మధ్య నీటి ప్రవాహం తగ్గనుండటంతో నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ బ్రిడ్జి మీదుగా వాహనాలు వెళ్లడంతో పాటుగా కింద నుంచి సందర్శకులు నడుచుకుంటూ వెళ్లేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి సందర్శకులు కృష్ణమ్మ నదీ సోయగాలను, నల్లమల అటవీ అందాలను వీక్షించనున్నారు. ఈ బ్రిడ్జి పర్యాటకులకు ఓ మధురానుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.
కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి పనులు వేగంగా జరిగేలా అధికారులతో పర్యవేక్షిస్తున్నాం. పనుల కోసం నాగర్కర్నూల్ జిల్లాలో 362 ఎకరాలు సేకరించా ల్సి ఉన్నది. మండల స్థాయిలో అధికారులు సంబంధిత రైతులతో మాట్లాడుతున్నారు. త్వరలో భూసేకరణపై నోటిఫికేషన్ జారీ చేస్తాం. గడువు లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
హైవే 167-కే పనుల్లో ప్రధానమైన భూ సేకరణను పూర్తి చేసేలా నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల కోసం 362 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. కల్వకుర్తిలో 106 ఎకరాలు, నాగర్కర్నూల్లో 76 ఎకరాలు, తాడూరులో 63 ఎకరాలు, కొల్లాపూర్లో 50 ఎకరాలు, పెద్దకొత్తపల్లిలో 40 ఎకరాలు, తెలకపల్లి మండలంలో 0.51 ఎకరాల చొప్పున భూ సేకరణ పెండింగ్లో ఉండగా త్వరలో పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న హైవే పనులతో ఇప్పటికే నాగర్కర్నూల్ నుంచి కొల్లాపూర్, కల్వకుర్తికి వెళ్లే ప్రయాణ సమయం దాదాపుగా 15 నిమిషాల వరకు తగ్గింది. రోడ్డు పనులన్నీ పూర్తయితే హైదరాబాద్- తిరుపతి మధ్య దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం తగ్గనున్నది. ప్రస్తుతం తిరుపతితో పాటుగా చెన్నై, ఇతర ఏపీలోని సీమ ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల మీదుగా ఉన్న జాతీయ రహదారి (హైవే-44) మీదుగా వెళ్లాలి. దీంతో ఒకటే మార్గం ఉండడంతో రోడ్డుపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. దీనివల్ల రోడ్డు ప్రయాణాలు వాహనదారులకు భారంగా మారాయి. కల్వకుర్తి-నంద్యాల పనులు పూర్తయితే ప్రయాణికులకు దూరభారంతో పాటుగా ఆర్థికంగానూ కలిసి వస్తుంది. ఈ రోడ్డుపై గరిష్ఠ వేగం వంద కిలోమీటర్లుగా నిర్ణయించనున్నారు. ఫలితంగా వాహనదారులకు దాదాపు రెండు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది.