వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో అడుగడుగునా నిర్మించారు. నీటి వృథాకు తావివ్వొద్దన్న సంకల్పంతో చేపట్టిన చెక్డ్యాంలు నీటితో తొణికిసలాడుతూ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. సమృద్ధిగా వర్షాలు కురవడం.. కృష్ణమ్మ జలాల రాకతో కరువు మాయమైంది. బీడు భూములు పచ్చని మాగాణిగా మారి సిరులు కురిపిస్తున్నాయి. రూ.50 కోట్లతో నిర్మించిన 20 చెక్డ్యాంల నుంచి సు‘జలం’ రాకతో జిల్లా సస్యశ్యా మలంగా మారింది. రెండు విడుతల్లో చేపట్టిన నిర్మాణాలు కొన్ని పూర్తికాగా.. మరికొన్నింటి పనులు చివరి దశలో ఉన్నాయి. కాగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అధికారులతో కలిసి చెక్డ్యాంలు, వీరాంజనేయ లిఫ్టు పనులను పరిశీలించనున్నారు.
వనపర్తి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు నెర్రెలు బాసిన, పడావు పడ్డ భూములు.. ఇప్పుడు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. సాగు, తాగునీటికి గోసపడ్డ వనపర్తిలో ఇప్పుడు జలసిరులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ప్రతి నీటిబొట్టునూ వినియోగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జిల్లాలో 20 చెక్డ్యాంలను నిర్మించారు. వీటి కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. రెండు విడుతల్లో చేపట్టిన చెక్డ్యాంలలో చాలా వరకు పూర్తికాగా.. మరికొన్ని పనులు చివరిదశకు చేరుకున్నాయి. అవసరం ఉన్న చోట ఆనకట్టలు నిర్మించడంతో భూగర్భజలాలు అపారంగా పెరిగాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తిలో సాగు, తాగునీటికి ఢోకా లేకుండాపోయింది. వరుసగా కరువు కాటకాలు వచ్చినా.. నీటి కటకట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏడాది పొడవునా చెరువులు నిండుకుండల్లా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ఏడు టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేశారు. ఇటీవలే కర్నెతండా ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రూ.76.19 కోట్లు మంజూరు చేయడంతోపాటు ముఖ్యమంత్రే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతలతో కర్నెతండా, పూల్సింగ్ తండా, హన్మ్యాతండా, చిన్నపీర్ తండా, ఆముదంబండ తండా, భీముని తండా, దొంతికుంట తండా, రుక్కన్నపల్లి తండా, పోతులకుంట తండా, జంగమాయపల్లి తండా, ఎర్రగడ్డ తండా, మేడిగడ్డతండా, గార్లబండ తండాతోపాటు పెద్దమందడి, ఖిల్లాఘణపురం, వనపర్తి, బిజినేపల్లి మండలాల్లోని 8 గ్రామాలు, 15 గిరిజన తండాల్లోని 4,235 ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ లిఫ్ట్ పనులు 35 శాతం పూర్తయ్యాయి. కర్నెతండా చెక్డ్యాంను ఈ ఏడాది దసరా రోజున మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు.
నేడు మంత్రి సమీక్ష, చెక్డ్యాంల సందర్శన
చెక్డ్యాంలపై మంత్రి నిరంజన్రెడ్డి గురువారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అధికారులతో కలిసి చెక్డ్యాంలను పరిశీలించనున్నారు. వనపర్తి మండలం చిట్యాల సమీపంలోని పడమటి తండా చెక్డ్యాం, బుద్ధారం పెద్ద చెరువు (రిజర్వాయర్), చిమనగుంటపల్లి, ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా, సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, వెంకటాంపల్లి, వెల్టూరు చెక్డ్యాంలు, వీరాంజనేయ లిఫ్ట్, గణపసముద్రం మరమ్మతు పనులను పరిశీలించనున్నారు.
చెక్డ్యాంలతో జలసిరి..
మొదటిదశలో రూ.23.58 కోట్లతో పెద్దమందడి మం డలం జగత్పల్లి గ్రామం వద్ద పెద్దవాగు, మనిగిల్ల చిన్నవాగు, వనపర్తి మండలం చిట్యాల వాగుపై చిట్యాల వద్ద, అదే వాగుపై పడమటి తండా, ఖిల్లాఘణపురం మండలం వెంకటాంపల్లిలోని పీతిరి వాగు, వీపనగండ్ల మండలం సంపత్రావుపల్లి సమీపంలోని పెద్దవాగు, నాగర్లబండ తండా వద్ద మల్లప్పనార్ని వాగు, పాన్గల్ మండలం చీకపల్లి గ్రామ శివారులో మల్లప్పనార్ని వాగు, రాయంపల్లి గ్రామ శివారులో పెద్దవాగు, తెల్లరాళ్లపల్లి గ్రామ శివారులో ఒకటి చొప్పున చెక్డ్యాంలు నిర్మించారు. రెండో దశలో రూ.26.32 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వనపర్తి మండలం రాజనగరం, కడుకుంట్ల, పెద్దమందడి మండలం వెల్టూరు, ఖిల్లాఘణపురం మండలం సల్కెలాపురం, చిల్కటోనిపల్లి, అప్పారెడ్డిపల్లి, కర్నెతండా, వెంకటాంపల్లిలో ఒకటి, చిమనగుంటపల్లి వాగుపై రెండు చొప్పున ఆనకట్ట నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో కర్నెతండా చెక్డ్యాంను మంత్రి ప్రారంభించారు. మూడు చెక్డ్యాంలు మినహా మిగతా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చెక్డ్యాంలతో 35 వేల ఎకరాలకు సాగునీరందనున్నది.