మక్తల్ టౌన్, సెప్టెంబర్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకంతో అర్హులకు ఆర్థిక భరోసా ఏర్పడుతున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మంతన్గోడ్, గువ్వలపల్లి, గుర్లపల్లి, సంగంబండ, మాద్వార్, దాసర్దొడ్డి, వనాయికుంట, యర్నాగన్పల్లి, సామన్పల్లి గ్రామాల్లో ని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన అందరికీ పింఛన్లు అందిస్తామన్నారు.
కుల, మత బేధాభిప్రాయాలు లేకుండా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందిస్తున్నామని చెప్పారు. దళితబంధుతో నియోజకవర్గానికి వంద యూనిట్లు కేటాయించగా.. 13 గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి అందించామన్నారు. రెండో విడుతలో 500 యూనిట్లు అందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.