సేద్యం పనుల్లో అన్నదాత
ముమ్మరంగా వ్యవసాయ పనులు
పలుచోట్ల విత్తనాలు వేసిన రైతులు
వనపర్తి జిల్లాలో 2.59 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఏరువాక పౌర్ణమి మొదలుకొని వ్యవసాయపనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. తొలకరి పలుకరించడంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వనపర్తి జిల్లానూ తాకడంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలకు, ట్రాక్టర్లకు పని చెబుతున్నారు. సగటున జిల్లాలో 102 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావడంతో పత్తి, వరి, కంది పంటల పనులు ప్రారంభించారు. వానకాలం సాగు 2,59,830 ఎకరాలుగా ఉండగా సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు వనపర్తి జిల్లా అధికారులు చెబుతున్నారు.
2,59,830 ఎకరాల సాగు అంచనా
50,581 క్వింటాళ్ల ఎరువులు
వరి 1,85,585
కంది 19,918
మొక్కజొన్న 11,631
జొన్న 2,642
పత్తి 17,421
వేరుశనగ 2,299
ఆముదం 2,588
ఇతర పంటలు 17,919
వనపర్తి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. పత్తి, వరి, కంది పంటలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించగా..మిగతా పంటల కోసం పొలాలు సిద్ధం చేస్తున్నారు. వరి నారు పోయగా.. ఇతర పంటలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. వనపర్తి జిల్లా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం దృష్ట్యా కంది, వేరుశనగ పంటకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పెసర, మినుముల పంటకు ఇంకా సమయం ఉండడంతో భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకడంతో భూమికి పదును ఏర్పడింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకొని అరకలు, ట్రాక్టర్లకు పనులు చెప్పారు. జిల్లాలో సగటు వర్షపాతం 102 మిల్లీ మీటర్లు నమోదు కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గోపాల్పేట, రేవల్లి, పాన్గల్, వీపనగండ్ల, పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాల్లో జొన్నలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరు పత్తి, మొక్కజొన్న, ఆముదం విత్తనాలు వేసేందుకు పొలాలు సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుత వానకాలం సీజన్లో 2,59,830 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. గత వానకాలంతో పోలిస్తే ఈ దఫా వనపర్తి జిల్లాలో పదివేల ఎకరాలకు పైగా అదనంగా సాగులోకి వస్తుందని భావిస్తున్నారు. గతేడాది 2,49,134 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది వరి 1,85,585, కంది 19,918, మొక్కజొన్న 11,631, జొన్న 2,642, పత్తి 17,421, రాగి 78, వేరుశనగ 2,299, ఆముదం 2588, ఇతర పంటలు 17,919 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా. అన్ని జిల్లాల్లో వరి తర్వాత పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తే.. ఇక్కడి రైతులు మాత్రం కందిని ఎక్కువ సాగుచేస్తున్నారు.
85 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం..
జిల్లాలో దాదాపు 85 వేల క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ, టీఎస్ సీడ్స్ సంయుక్తంగా సిద్ధం చేసి విక్రయ కేంద్రాలకు తరలించారు. వరి, వేరుశనగ, కందులు, పెసలు, పప్పుశనగ, మినుములు, పెసర, జీలుగ, జనుము, మొక్కజొన్న, ఆముదం తదతర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పీఏసీసీఎస్ల ద్వారా రైతులకు అందించేందుకు సీడ్ విత్తనాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. విత్తనాల కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. వరి 46,400 క్వింటాళ్లు, కందులు 800, మొక్కజొన్న 950, జొన్నలు 110, ఆముదాలు 55, వేరుశనగ 2,090 క్వింటాళ్లు, పత్తి 35 వేల బ్యాగులు సిద్ధం చేశారు. అలాగే యూరియా 25,816, డీఏపీ 5,025, ఎంవీపీ 2,008, కాంప్లెక్స్ 12,908, ఎస్ఎస్పీ 4,824 బస్తాల ఎరువులు అవసరమున్నట్లు గుర్తించి అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ వరకు విడుతల వారీగా రైతులకు అందజేయనున్నారు.
సూచనలు, సలహాలు ఇస్తున్నాం..
జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బో రుబావుల కింద వరినారు పోశారు. వర్షాలు బాగా కురిస్తే నాటు వేయనున్నారు. రైతులు లాభదాయకమైన సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. తొలకరి వర్షాలు కురవడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి, కంది, జొన్న వంటి విత్తనాలు నాటుతున్నారు. – సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, వనపర్తి