సిద్ధమవుతున్న వానకాలం దుక్కులు
సాగు పనుల్లో రైతన్నలు
త్వరలో రైతుబంధు నిధులు
అంచనాలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
నాగర్కర్నూల్ జిల్లాలో వరి 25 శాతం తగ్గింపు
4.40 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి
పత్తి 25 శాతం, కందులు 300 శాతానికి పెంపు
పప్పు పంటలకు ప్రాధాన్యత
ఎరువుల అంచనాలు పూర్తి
రైతువేదికల వద్ద రైతులకు అవగాహన సదస్సులు
వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈసారి వర్షాలు ముందే
కురుస్తుండడంతో అంచనాతో అన్నదాతలు సమాయాత్తమవుతున్నారు. దుక్కులు దున్నుతూ వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశంతో వ్యవసాయ శాఖ సైతం కర్షకులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై అంచనాలు సిద్ధం చేసింది. గతేడాతో పోలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో ఈ సీజన్లో 25 శాతం వరిని తగ్గించడంతో పాటుగా ఇతర పంటలైన పత్తి, కంది పంటలను ప్రోత్సహించేలా అధికారులు రైతులను చైతన్యం చేయనున్నారు. 4.40 లక్షల ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈసారి పప్పు పంటలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. త్వరలో రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందనుండడంతో మరింత ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నం కానున్నారు.
నాగర్కర్నూల్, మే 22 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ముందే కురుస్తాయన్న అంచనాతో రైతులు సాగుకు సమాయాత్తమవుతుండగా ప్రభుత్వ ఆదేశంతో వ్యవసాయశాఖ సైతం రైతులకు కావాల్సిన ఎరువులతో పాటు సాగుపై అంచనాలు రూపొందించింది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 25శాతం వరిని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటలను ప్రోత్సహించేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయనున్నది. జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో రైతులు పండించే పంటలపై నివేదికలు రూపొందించారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, వేరుశనగను 25శాతం పెంచనున్నారు. అలాగే పప్పుదినుసులై కంది సాగును 300శాతం పెంచేలా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. మార్కెట్లో పప్పు దినుసుల పంటలకు అధిక డిమాండ్ ఉంది.
కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం జొన్న, మొ క్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు తదితర పంటలను పండించేలా సూచనలు ఇస్తోంది. రైతు వేదికల వద్ద ఏఈవోలు నిత్యం మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు అందుబాటులో ఉండనున్నారు. ఇక్కడ ప్రతి వారం రెండుసార్లు రైతులకు సాగు, రైతుల సమస్యలపై ఏఈవోలు వివరించనున్నారు. దీనివల్ల సీజన్లో రైతులకు విత్తనాలు వేసినప్పటి నుంచి మార్కెట్కు పంటలు తరలించుకునే వరకు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు. సింగిల్విండోల ద్వారా, మార్కెట్లో రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతున్నది. రైతుబంధు నిధులను కూడా త్వరలో అందజేయనున్నది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు ప్రారంభమయ్యా యి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో భూములు చల్లదనం సంతరించుకొంటున్నాయి. ఈసారి ముందస్తు వర్షాలు ఉంటాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతులు వానకాలం ఆరంభంలోనే విత్తనాలు విత్తేందుకు సమాయాత్తమవుతున్నారు. భూసార పరీక్షలకు సైతం చేయించుకొంటున్నారు.
కందనూలులో పత్తికి ప్రాధాన్యత
నాగర్కర్నూల్ జిల్లా 13లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 6,35,602 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. గత వానకాలంలో 6,13,878ఎకరాల్లో సాగు చేయగా, 2021లో 5,44,433ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి గతేడాది కంటే 16శాతం అధికంగా సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇందులో అగ్రస్థానంలో రాష్ట్రంలోనే ప్రముఖంగా పత్తి పంట 4,40, 932 ఎకరాల్లో సాగు కానున్నది. ఆ తర్వాత స్థానంలో వరి 95,234 ఎకరాల్లో, మొక్కజొన్న 55,654ఎకరాల్లో, కందులు 30,912ఎకరాల్లో, జొన్న 5,148ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా. ఆ తర్వాత 2474ఎకరాల్లో శనగలు, వేరుశనగ 1904ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 1188ఎకరాల్లో సాగు కానున్నది. ఇక పంటలకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీలాంటి ఎరువులు 1,39,065మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు అంచనా తయారు చేశారు. జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా గత యాసంగి సీజన్ మాదిరిగానే 2.90లక్షల మందికి ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.366కోట్ల మేర పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతుల ఖాతాలను ప్రభుత్వానికి నివేదించింది.
పత్తి పంటకే అధిక ప్రాధాన్యత
వానకాలంలో సాగుకు ప్రణాళికలు తయారు చేశాం. పప్పు, నూనె గింజల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు ఏఈవోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. నాగర్కర్నూల్ జిల్లాలో 6.25లక్షల ఎకరాలకు గానూ 4.40లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. రైతులు తొందరపడకుండా వర్షాలు మంచిగా కురిసి నేలలో వేడిపోయి తడి వచ్చాక విత్తనాలు వేసుకోవాలి. ఏ సందేహాలున్నా రైతువేదికల వద్ద ఏఈవోల ద్వారా నివృత్తి చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్కర్నూల్