జడ్చర్ల, మే 20 : ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో కొను గోలు చేయపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని చూసిన రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లకుండా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ బాటపట్టారు. ఇదే అదునుగా చేసుకొని మార్కెట్లో వ్యాపారులు తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతుధరలు క్వింటాకు రూ.2,400ఉండగా వ్యవసాయ మార్కెట్లో రూ.1600నుంచి రూ.1900మధ్య కొనుగోలు చేస్తుండటంతో రైతులు రూ.600 వరకు నష్టపోతున్నారు.
అదేవిధంగా ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతుధర క్వింటాకు రూ. 2,389ఉండగా మార్కెట్లో వ్యాపారులు రూ.1600 నుంచి రూ.2300కు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కూడా రూ.1600 పైచీలుకు ధరలు వచ్చిన రైతులు రూ.400 వరకు నష్టపోతున్నారు. జడ్చర్ల మండ లంలో ఇప్పటి వరకు కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించ లేదు. జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 1,01,831బస్తాలు కొనుగోలు చేయగా 81,536బస్తాలు గోదాంలకు తరలించారు. ఇంకా మార్కెట్ ఆవరణలో దాదాపు 15వేల బస్తాల వరకు ఉండగా.. 8వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గద్వాల వ్యవసాయమార్కెట్ యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొచ్చి 28రోజులైంది. ఈనెల 14న తూకం వేశారు. తూకం వేసి ఆరురోజులైనా ధాన్యం గోదాంకు తరలించడం లేదు. అకాల వర్షాలు వస్తున్నాయి సార్ తమ ధాన్యాన్ని గోదాంకు తరలించాలని వేడుకున్నా అధికారులు కనికరించడం లేదు. ధాన్యం తరలింపు టోకెన్ కోసం అధికారులను ఐదురోజులు వారి వెంట తిరుగుతూ అడుక్కుంటున్న టోకెన్ రాయడం లేదు. వర్షం పడితే మొత్తం తడిసి పోయే అవకాశం ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే దానిని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
28 రోజులుగా ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ యార్డులో రైతులకు సరైనా వసతులు లేవు. తాగుదామంటే మంచినీరు లేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి అమ్ముకోవడం కంటే బయట అమ్ముకోవడం మేలు. ప్రభుత్వం చెప్పింది ఒకటి ప్రస్తుతం చేస్తున్నది ఒకటి. గన్నీ బ్యాగులు సరఫరా చేయక రైతులను ఇబ్బందులకు గురి చేసింది. తామే గన్నీ బ్యాగులు తెచ్చుకొని తూకం వేయమంటే 28 రోజులైంది. ఇదెక్కడి ప్రభుత్వం. గత ప్రభుత్వం ముందు చూపుతో ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు.