రాజోళి, మార్చి 30 : రాజోళి మండలంలో నిర్మిస్తున్న భారత్మాల జాతీయ రాహదారి పనులను రాజోళి మండల రైతులు అడ్డుకున్నారు. రాజోళి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తును పెంచాలని వారు డిమాండ్ చేశారు. శనివారం రహదారి పనులను రైతులు అడ్డుకొని బ్రిడ్జి ఎత్తు పెంచాలని రహదారి అధికారులు డీజీఎం జనార్దన్, డీపీఎం రవిచంద్రను ఫోన్లో కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని వారు సమాధానం ఇవ్వడంతో స్థానికులు మండిపడ్డారు. రైతులకు ఇబ్బందులు కలిగేలా పనులు చేపడితే పనులను అడ్డుకొని నిరసన చేస్తామని హెచ్చరించారు.
మండలంలో సుబాబుల్, చెరకు, పత్తి పంటలు విరివిగా పండిస్తుంటారు. పక్క రాష్ర్టాల రైతులు కూడా తమ వ్యాపారాలను ఈ రహదారిపైనే కొనసాగిస్తుంటారు. బ్రిడ్జి 4మీటర్ల ఎత్తు ఉండడంతో పంట తరలించే వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. రైతులు అధికారులకు తెలిపారు. తమను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి ఎత్తును 8మీటర్లకు పెంచాలని, అంత వరకు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని తాసీల్దార్ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజోళి గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.