ధరూరు, సెప్టెంబర్ 22 : దొరలు, రాజుల కాలంలో ఉమ్మడి ఆస్తి గా కులానికి ఇచ్చిన బంజరు భూమి, అరుతడి పంటలకు కూడా నోచుకోని భూమి, అమ్ముదామన్నా కొనని భూములు నేడు సీఎం కేసీఆర్ కృషితో ధాన్యపు సిరులు పండుతున్నాయి. మండల కేంద్రంలో గతంలో పూర్వికులకు ఇచ్చిన బంజరు భూమి మాన్యం పట్టాగానే చాలా మందికి ఉన్నాయి. సుమారు 300 గడపలకు మాన్యం పట్టాలు ఉన్న భూమే దిక్కు. ప్రస్తుతం అదేభూమికి ఎనలేని విలువొచ్చింది. నెట్టెంపాడు డిస్ట్రీబ్యూటరి (పిల్ల కాల్వ) వెళ్లడం వారికి వరంగా మారింది. పుష్కలంగా రెండు పంటలకు నీటిని సరాఫరా చేస్తుండడంతో కాల్వ కింది రైతులు పండుగలా సాగు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం పొందిన కుటుంబ సభ్యులు సైతం నేడు ఈ భూమి హక్కు కోసం పాకులాడుతున్నారంటే అందుకు ప్రధాన కారణం నెట్టెంపాడు కాల్వనే. ఇదే కాల్వ కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్కు వలసవెళ్లిన కుటుంబాలను సైతం వెనక్కి రప్పించింది. ఇదే భూమిలో కూలీలు ప్రతి సంవత్సరం రెండు పంటల్లో నాటు, కలుపు తీసే పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఏండ్ల నుంచి కడగండ్లు మిగిలిన రైతుల కళ్లల్లో ఆనందభాష్పాలు కురిపించిన సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వలస వెళ్లి బతికేటోళ్లం..
మాది పేద కుటుంబం. వలస వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూ జీవనం సాగించేవారం. గతంలో సాగునీరు లేక ఉన్న కొంత మాన్యం భూమి ఎందుకూ పనికిరాకుండా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ సారు నెట్టెంపాడు కాల్వ ద్వారా నీళ్లు అందించాడు. దీంతో సాగునీరు వచ్చింది. వలస వెళ్లే మేము ఇప్పుడు దర్జాగా ఉన్న ఊర్లోనే రెండు పంటలు సాగుచేసుకుంటున్నాం. సీఎం సారు మా బతుకులు మార్చిండు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
కూలి నుంచి యజమానిగా మారాం..
ఒకప్పుడు కళ్లాలలో వదిలిన మట్టి గింజలతో కడుపు నింపుకునే మాకు అదే మట్టిలో మాణిక్యాలు పండించుకునే సౌలతి సీఎం కేసీఆర్ సారు ఇచ్చిండు. సేరు గింజలకు పెద్ద రైతులు కూలీకి పిలిస్తే గత్యంతరం లేక వెళ్లేటోళ్లం. సాగునీటి రాకతో నేడు పరిస్థితులు మారిపోయినయ్. మా పంటలు మేం పండించుకుంటున్నాం. ఒకరి దయాదాక్షిణ్యాలు లేకుండా మా బతుకులకు భరోసా కలిగింది.
– బందెన్న, రైతు, ధరూరు