Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు. పంటపొలాల్లో వరి, పత్తి, వేరుశనగ తప్పా వేరే పంట కానరావడం లేదు. ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తున్నది. పంట ఉత్పత్తులు ఎక్కువ కావడం వల్ల మద్దతు ధర లభించడం లేదు. దీంతో మార్కెట్లో మిగతా పంట ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సాగుచేపడితే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించొచ్చని చెబుతున్నారు.
– గద్వాల, ఫిబ్రవరి 27
గద్వాల, ఫిబ్రవరి 27 : జిల్లాలోని భూములన్నీ అన్ని పంటల సాగుకు అనుకూలమైనా రైతులు వరిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గతంలో ప్రధానంగా రైతులు వర్షాధార, బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగు చేసేవారు. వర్షాధార పంటలు సాగు చేయడం వల్ల ఖర్చు తక్కువగా ఉండడంతోపాటు లాభాలు ఎక్కువగా వచ్చేవి. అయితే రాను రానూ రైతులు వర్షాధార పంటలవైపు ఆసక్తి పెంచకుండా ఇతర పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వర్షాధార పంటలు వేయకుండా వానకాలం, యాసంగి రెండు పంటలూ వరి వేయడం వల్ల మార్కెట్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు వేరుశనగ, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల వంటి లాభాల పంటలు సాగుచేస్తే ఆదాయం పెరగడంతో పాటు రైతుకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
గతంలో జిల్లాలో ప్రధానంగా రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేసేవారు. దీంతో సాగుకు ఖర్చు తక్కువ కావడంతోపాటు ఎరువులు, కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. పండించిన ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేవి. 30ఏండ్ల కిందట రైతులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో రైతులు వేరుశనగ, పప్పుశనగ, పొగాకు, మొక్కజొన్న, కుసుమ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, మినుములు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, కంది, అలసందలు, వాము తదితర పంటలు సాగు చేసేవారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చేవి. అయితే ఇందులో ప్రస్తుతం రైతులు ఎక్కువగా వరి, పత్తి మాత్రమే పండించడంతో ఇతర ధాన్యాలకు మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి.
జిల్లాలో వానకాలంలో రైతులు వరి 68,219ఎకరాలు, జొన్న 404, సజ్జలు 723, మొక్కజొన్న 13,719, కొర్ర 187, పెసర్లు 42, ఉలవలు 61, మినుములు 333, వేరుశనగ 16,434, ఆముదం 6,140, పొగాకు 1,387, పొద్దుతిరుగుడు 116 ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో వరి 61,103ఎకరాలు, జొన్న 4,063, వేరుశనగ 23,190, మొక్కజొన్న 12,050, పప్పుశనగ 16,360, మినుములు 12,809, పొగాకు 3500 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో నీటి సౌలభ్యం ఎక్కువగా ఉండడంతో రైతులు వరిసాగుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు సాగు ఖర్చులు పెరిగాయి. వ్యవసాయానికి యంత్రాలు వినియోగిస్తుండడంతో కాడెద్దులు కనుమరుగవుతున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రైతులు మొదట దుక్కి దున్ని విత్తులు విత్తిన తర్వాత ఒకటి లేదా రెండు సార్లు మందులు పిచికారీ చేస్తే పంట చేతికొచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఎకరా సాగుకు కాడెద్దులు వినియోగిస్తే రూ.200 నుంచి రూ.300 ఖర్చయ్యేది. ప్రస్తుతం సాగుకే రూ.15వేల ఖర్చు అవుతుంది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం ఎకరాలో సాగు చేయాలంటే విత్తనం మొదలు పంట చేతికొచ్చేవరకు సుమారు రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చవుతుంది. పాతకాలంలో ఎకరా సాగు చేయాలంటే రూ.5వేలకు మించేది కాదని రైతులు చెబుతున్నారు. గతంలో రైతులు సాగుచేసిన పంటలు, లాభాలు తమ అనుభవాలు వారి మాటల్లోనే..
వెనుకటికి బోరుబావుల కింద ఒక పంట మాత్రమే వరి సాగు చేసేటోళ్లం. అది కూడా కుటుంబానికి సరిపడా సాగు చేస్తుంటిమి. వానకాలంలో కొర్రలు, జొన్న, పెసర్లు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, పత్తి, కుసుమ, అనుములు, కాకర ఎక్కువగా పండించాము. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరిసాగుపై ఆసక్తి చూపుతూ ఇతర పంటలు సాగుచేయడం లేదు. దీంతో ఇతర పంటలకు డిమాండ్ పెరిగింది. కొర్రన్నం, జొన్న రొట్టెలు తినడం వల్ల ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నాం.
– పద్మన్న, రైతు, కుర్వపల్లి
గతంలో వర్షాధార పంటలు సాగు చేయడం వల్ల పెట్టుబడి, కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. లాభాలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం నీటివసతి పెరగడంతో రైతులు వరిసాగు ఎక్కువగా చేయడంతో పెట్టుబడి పెరిగింది. రైతులు పెట్టుబడి తక్కువగా ఉండే జొన్న, కొర్రలు, కుసుమల, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, పెసర్లు, అనుములు సాగు చేస్తే లాభాలు బాగా వస్తాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎనుకటికి ఆరుతడి పంటలు మందూ మాకు లేకుండా పండించాం. ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు రావడంతో రసాయన మందులు వాడితేనే పంటలు చేతికి వస్తున్నాయి.
– ముసలన్న, రైతు, కుర్వపల్లి