మహబూబ్నగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగకు మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగకు మంచి రేటు ఉన్నప్పటికీ వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్లకు వందలాది క్వింటాళ్ల వేరుశనగ పోటెత్తుతున్నా.. కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేయకపోవడం తో రైతులు మార్కెట్లలోనే రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వంటావార్పు కూడా మార్కెట్లోనే చేసుకుంటూ వేరుశనగ కొంటారని ఆశతో ఎదురుచూస్తున్నా రు. కానీ వ్యాపారులు, దళారులు కుమ్మక్కై తక్కువ ధరకు టెండర్లు వేసి రైతులను నిలువునా ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి వేరుశనగ కొనుగోలు చేయకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగి ఏకంగా అచ్చంపేట మార్కెట్ యార్డు కార్యాలయంపై దాడికి ప్ర యత్నించారు. కల్వకుర్తిలోనూ రాస్తారోకోకు దిగారు. మహబూబ్నగర్లో కూడా రైతులు మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. వనపర్తితోపాటు మిగతా మార్కెట్లలో కూడా వేరుశనగ కుప్పలు తెప్పలుగా అలాగే పడి ఉన్నాయి. ఎప్పుడు కొంటారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇటు ప్ర భుత్వం కానీ అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెలరోజుల నుం చి ఆయా జిల్లాలోని మార్కెట్లకు రైతులు వేరుశనగ అమ్మడానికి తీసుకొస్తున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటా వేరుశనగకు రూ.8 వేలు ధర ఉన్నప్పటికీ.. మా ర్కెట్లలో గరిష్ఠ ధర రూ.7,187గా ఉన్నది. కాగా, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రైతులు ఎలాగోలా తమకే అమ్ముతారని ధీమాతో వ్యాపారులు కుమ్మక్కై గరిష్ఠ ధరకు రూ.3వేలు తక్కువకే టెండర్ కోట్ చేస్తున్నారు. దీనికి మార్కెట్ అధికారులు కూడా వంత పాడుతున్నారు. నామమాత్రంగా వ్యాపారస్తులు గరిష్ఠ ధరకు ఐదు పది క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి మిగతా వేరుశనగను నాణ్యతలేదనే పేరుతో రిజెక్ట్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర ఇప్పించాల్సిన మార్కెట్ అధికారులు వ్యాపారస్తులతో కుమ్మక్కు కావడం రైతుల ఆగ్రహానికి కారణమవుతున్నది. ఈ కారణంగానే అచ్చంపేట మార్కెట్ యార్డుపై రైతులు దాడికి తెగబడ్డారు. వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చి రోజులు గడుసున్నా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు ఏకం గా మార్కెట్ చైర్పర్సన్పై దాడికి దిగారు. మార్కెట్ చై ర్మన్ మహిళా అని కూడా చూడకుండా ఆమెను బయటకులాగి దాడి చేసినంత పని చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో వేరుశనగ రైతులు రోడ్డు ఎక్కుతున్నా ఇటు అధికార యంత్రాంగం.. అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. పదిహేనురోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశనగను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఉలుకూపలుకూ లేదు. కలెక్టర్లు కూడా ఆయా మార్కెట్లను తనిఖీ చేయకుండా వ్యాపారస్తులకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో రెచ్చిపోయిన వ్యాపారస్తులు మార్కెట్ అధికారులతో కుమ్మక్కై వేరుశనగకు తక్కువ ధర టెండర్లు వేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మార్కెట్లో వేరుశనగ కొనుగోలు పూర్తిగా మందగించడంతో రైతులు వచ్చిన ధరకే అమ్ముకొని నష్టపోతున్నారు. మరికొంతమంది రైతులు కడుపు మంటతో ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరైన మద్దతు ధర కల్పించి మార్కెట్లకు వచ్చిన వేరుశనగను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో రైతులు పండించిన వేరుశనగకు మంచి డిమాండ్ ఉంది. గతేడాది అత్యధిక ధరకు వేరుశనగ విక్రయించడంతో రైతులు లాభాల బాట పట్టారు. ఈసారి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం 2 వేల మెట్రిక్ టన్నుల వేరుశనగ పండింది. కొంతమంది రైతులు ప్రైవేట్ గానుగ మిల్లులకు వేరుశనగను సైప్లె చేశారు. మిగతా రైతులంతా మార్కెట్లకు తరలించి అమ్ముకుందామని ప్రయత్నిస్తు న్నా వ్యాపారులెవరూ కొనుగోలు చేయడానికి ముందుకురావడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి వేరుశనగను మార్కెట్లలో కుప్పలు కుప్పలుగా పోసుకొని వాటి చుట్టూ కాపలాకాస్తున్నా రు. మార్కెట్లలో పందులు వేరుశనగను తినకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తీ రా వేరుశనగ తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొ నుగోలు చేయకపోవడంతో రైతుల్లో అసహనం పె రుగుతున్నది. దీంతో అన్నదాతలు అక్కడక్కడా అధికారులపై తిరగబడుతున్నారు.