వనపర్తి రోడ్ల విస్తరణ చకచకా జరుగుతున్నది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. ఎంతగా అంటే ఎవరైనా పనుల నిమిత్తం రావాలంటే హైదరాబాద్, ఖిల్లా, కొల్లాపూర్, కొత్తకోట రోడ్లను చూస్తేనే హడలెత్తి పోయే పరిస్థితి. కానీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. రోడ్లను అనుసరించి ఉన్న ఇండ్ల యజమానులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఒప్పించారు. దీంతో స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి ఆస్తులను అప్పగించారు. వీరికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు మంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇకపై రహదారులు విశాలంగా మారనుండడంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి , డిసెంబర్ 11: వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ ఒకప్పుడు పట్టణ ప్రజలకు కలగా మిగిలింది. తెలంగాణ రాకముందు నాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ చేస్తాం.. అని చెప్పడం తీరా అమల్లోకి వచ్చేసరికి శూన్యంగా మిగిలిపోయేది. రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కదా చూద్దాం.. ఇలాంటివి ఎన్ని చూడలేదు అంటూ వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో గెలిచిన వెంటనే వనపర్తి ప్రధాన రహదారుల రోడ్ల విస్తరణకు బీజం పడింది. దీంతో రోడ్ల విస్తరణ పనులు చకచకా ముందుకుసాగడంతో వనపర్తికి మంచి రోజులు వచ్చాయి. ఇకపై ట్రాఫిక్ సమస్య ఉండదంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లవిస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలను కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
రోడ్లవిస్తరణకు పలుమార్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో సమావేశాలు నిర్వహించారు. వేగంగా పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో రోడ్లవిస్తరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుందని వారికి వివరించారు. మంత్రి సూచనల మేరకు చాలామంది రోడ్ల విస్తరణకు సహకరించడంతో రోడ్లవిస్తరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రోడ్ల విస్తరణ జరుగుతున్న సమయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెద్ద పెద్ద డ్రైనేజీలతోపాటు జెర్రిపోతుల మశమ్మ వాగువద్ద, రామా థియేటర్ వాగు వద్ద, చింతల హనుమాన్ ఆలయం సమీపంలో వరద ప్రవాహం నివారించేలా పెద్ద పెద్ద కల్వర్టును ఏర్పాటు చేస్తున్నారు.
వనపర్తి పట్టణానికి ఐదు ప్రధాన రహదారులు ఉన్నాయి. కొత్తకోట, ఖిల్లాఘణపురం, పెబ్బేరు ప్రధాన రహదారి పనులు మొత్తం పూర్తి కాగా, హైదరాబాద్ రోడ్డు, పాన్గల్ రోడ్డులో దాదాపుగా 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఖిల్లాఘణపురం, హైదరాబాద్ రోడ్డులో రోడ్లవిస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారు స్వచ్ఛందంగా తమ ఇండ్లను కూలగొట్టుకోగా వారికి చిట్యాల సమీపంలో, అప్పాయిపల్లి గ్రామశివారులో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు.
పట్టణంలో రోడ్లవిస్తరణ కలగానే మిగులుతుందని అనుకున్నాం. కానీ, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితోనే రోడుల విస్తరణ సాధ్యమైంది. రోడ్లవిస్తరణ ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారు స్వచ్ఛందంగా ముందుకురావడం, అభివృద్ధి అడ్డుకాదంటూ స్వచ్ఛందంగా ఇండ్లను తొలగించుకొని సహకరిస్తున్నారు. మంత్రి సూచనల మేరకు ప్రతిరోజూ పట్టణంలో జరుగుతున్న రోడ్లవిస్తరణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేసేందుకు కృషిచేస్తున్నాం.
– గట్టు యాదవ్, మున్సిపల్ చైర్మన్, వనపర్తి