పరిగి, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్దమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో తుది పోరులో 15 మంది అభ్యర్థులు నిలిచారు. పరిగి నుంచి 26 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 11 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 15 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. వారిలో ఎవరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో తుది పోరులో 15 మంది అభ్యర్థులు నిలిచారు. పరిగి అసెంబ్లీ స్థానంలో మారుతీకిరణ్ బూనేటి(భారతీయ జనతా పార్టీ), డాక్టర్ తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), కె.మహేశ్రెడ్డి(భారత రాష్ట్ర సమితి), ఇ.ఆనందం(బహుజన సమాజ్ పార్టీ), శ్రీశైలం బాయికాని(సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి), భాస్కర్ బేగరి(తెలంగాణ రిపబ్లికన్ పార్టీ), మంగలి నరేష్(ధర్మ సమాజ్ పార్టీ), మహ్మద్ సలీం(భారత చైతన్య యువజన పార్టీ), మహేశ్రెడ్డి బరెడ్డి(అలియెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), పత్లావత్ గట్యానాయక్(బహుజన్ ముక్తి పార్టీ), ముకుంద నాగేశ్వర్(స్వతంత్ర), బోయిని రాఘవేంద్ర(స్వతంత్ర), దూదేకుల గౌస్(స్వతంత్ర), బేరి రాంచందర్యాదవ్(స్వతంత్ర), జి.మల్లేశంగౌడ్(స్వతంత్ర) అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,59,422 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 1,31,163 మంది, మహిళలు 1,28,250 ఇతరులు 9 మంది ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఏపీవో, ఇరువురు ఓపీవోలు, బూత్ లెవల్ ఆఫీసర్లు ఉండనున్నారు. నియోజకవర్గంలో 165 పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ నిర్వహించనుండగా, 60 పోలింగ్ స్టేషన్ల బయట సైతం వెబ్ క్యాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గంలో అయిదు మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 22 రూట్లు ఏర్పాటు చేయడంతోపాటు 22 మందిని సెక్టోరియల్ అధికారుల నియామకం జరిగింది.అలాగే 45 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 456 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, కర్ణాటక నుంచి వచ్చిన 165 మంది హోంగార్డులు, 37 మంది ఎఆర్ హెడ్క్వార్టర్స్ నుంచి వచ్చిన పోలీసులు, ఐదుగురు శ్రీకాకుళం జిల్లా పోలీసులు, సీఎఆర్ఎఫ్కు సంబంధించి 90 మంది విధులు నిర్వహించనుండగా, గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పోలీసులు విధులు నిర్వహిస్తారు.
పరిగిలోని మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించారు. పోలింగ్ సిబ్బంది సంబంధిత పోలింగ్ స్టేషన్కు కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతర పోలింగ్ సామాగ్రిని 27 పెద్ద బస్సులు, 15 చిన్న బస్సులలో తీసుకువెళ్లారు. ఆయా రూట్లలో 22 మంది సెక్టోరియల్ ఆఫీసర్లతోపాటు పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సామగ్రి తరలించారు.
పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం పరిగిలోని మినీస్టేడియంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రా న్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విధులు నిర్వహించే అధికారులందరు సమష్టిగా పనిచేసి పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ సామగ్రి తీసుకువెళ్లిన వెంటనే తమ పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే నోడల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే సిబ్బంది కేంద్రాల్లో ఉండాలని, ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాలని సూచించారు. మాక్ అనంతరం సీఆర్సీ చేసి, వీవీ ప్యాట్ల నుండి స్లిప్పులను తొలగించి మాక్ పోలింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా పోలింగ్ మొదలు పెట్టాలని, పోలింగ్ క్రమంలో రెండు గంటలకు ఒకసారి తప్పనిసరిగా రిపోర్టును ఇవ్వాలని పేర్కొన్నారు. రీ పోలింగ్కు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని అన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి విజయకుమారి, డివైఎస్వో హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ పాల్గొన్నారు.