పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 13 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేయగా.. సీసీ నిఘా.. 144 సెక్షన్ అమలు చేయనున్నారు. వెబ్కాస్టింగ్తో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు.
నాగర్కర్నూల్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులూ పిల్లలను సంసిద్ధం చేశారు. పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనకబడిన విద్యార్థులతో పాటుగా మెరుగైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రభుత్వం పాఠశాలల్లో సాయంత్రం వేళ అల్పాహారం అందించింది. ఇక తల్లిదండ్రులు ఇండ్లల్లో తమ పిల్లలకు కావాల్సిన వాతావరణం, ఆహారం అందిస్తున్నారు. మంచి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇలా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతుండగా విద్యా శాఖ నిర్వహణకూ చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేసి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, స్కాడ్లను నియమించింది. పరీక్షా పత్రాలను ఇప్పటికే పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూంలకు చేర్చి భద్రపర్చారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పరీక్షాకేంద్రాల పరిసరాల్లో 144సెక్షన్ విధించారు. జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల కోసం హాల్ టిక్కెట్లను జారీ చేసింది. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచింది. పరీక్షలు రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. కేంద్రంలోకి చేరుకునేందుకు 5 నిమిషాల సడలింపును ఇచ్చారు. ఇక విద్యార్థుల కోసం ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. హాల్ టికెట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణానికి అనుమతించనున్నారు. ఇక ఎండలు అధికంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్ఎంలతోపాటు వైద్య కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే మంచినీరు, శానిటేషన్ సౌకర్యాలతో పాటుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపట్టారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకుగానూ కేంద్రాల్లోకి వచ్చే ఫ్లయింగ్ స్కాడ్లు, ఇతర సిబ్బంది ఎవరికీ కూడా సెల్ఫోన్ అనుమతించడం లేదు. ప్రతిఒక్కరూ గుర్తింపు కార్డు ధరించి కేంద్రాలకు రావాలని డీఈవోలు ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 61 పరీక్షా కేంద్రాల్లో 10,572మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. రోజూ ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. కాంపోజిట్ సైన్స్ పరీక్ష మాత్రం 9:30 నుంచి 12:50 వరకు ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్షలకు కావాల్సిన సిబ్బందిని నియమించాం. కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరు, టాయ్లెట్లు, విద్యుత్, ఫ్యాన్లలాంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్