అచ్చంపేటటౌన్, మే 8 : అరణ్యంలో చెంచుల విద్యాభ్యాసానికి సరస్వతీ విద్యాపీఠం బాసటగా నిలుస్తున్నది. చెంచు పెంటల్లో వలంటీర్లను ఏర్పాటు చేసి బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను పంపిణీ చేయడంతోపాటు విలువలతోకూడిన విద్య అందిస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాలను 1981 సంవత్సరంలో స్థాపించారు. సరస్వతీ విద్యాపీఠం హైదరాబాద్ వారి మార్గదర్శనంలో పాఠశాల కొనసాగుతున్నది. అయితే ఆదివాసీ పిల్లలు సమాజంలో అందరిలాగే విద్య అభ్యసించాలన్న ఉద్దేశంతో సరస్వతీ విద్యాపీఠం వారి సహకారంతో లింగాల, బల్మూరు మండలాల్లోని చెంచు పెంటల్లో ఏకల్ విద్యాలయాలను ఏర్పాటు చేశారు.
సుమారు 50మంది బాలబాలికలకు విద్యాబోధన చేసేందుకుగానూ 15మంది వలంటీర్లను నియమించారు. చెంచుపెంటల్లో పనిచేసే వలంటీర్లకు అచ్చంపేటలోని వనవాసి సేవాప్రకల్ప బాలుర హాస్టల్లో ప్రతినెలా రెండురోజులపాటు విద్యార్థి వికాసయోజనపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, ఏఏ సబ్జెక్టులు నేర్పించాలనే అంశాలపై మెళకువలు అందిస్తున్నారు. ఆదివాసీ పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా సరస్వతీ విద్యాపీఠం కృషి చేస్తున్నది.
విద్యార్థులకు క్రీడాపోటీలు, విజ్ఞానశాస్త్ర మేళాలు నిర్వహించడంతోపాటు సంస్కృతీసంప్రదాయాలు, దేశభక్తి, స్వాతంత్య్ర పోరాటం, చారిత్రక అంశాలు, నీతి కథలతోకూడిన విద్యను అందిస్తున్నారు. పాఠశాలస్థాయి, జిల్లా, విభాగ్, ప్రాంతస్థాయిల్లో పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందిస్తున్నారు. సమాజం, దేశంపై గౌరవం, సేవాభావం, నీతినిజాయితీ, విలువలు, సాంస్కృతిక, సామాజిక, జాతీయవాదాన్ని వ్యాప్తి చేయడంలో సరస్వతీ విద్యాపీఠం ఎనలేని కృషి చేస్తున్నది. ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యనభ్యసించి ఉన్నత పదవులను అధిరోహించారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు.
విద్యతో బంగారు భవిష్యత్తు
అచ్చంపేట పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు అనుబంధంగా నడుస్తున్న వనవాసీ సేవాప్రకల్ప బాలుర ఆవాసంలో ఉంటూ 1నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాను. ఇక్కడ మాకు సంస్కారం, క్రమశిక్షణ, విలువలతోకూడిన విద్య అందించేవారు. అలాగే ఉచితంగా బట్టలు, పుస్తకాలు అందించారు. నేను ఈ పాఠశాలలో చదవడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించగలిగాను.
– నిమ్మల శివుడు, పూర్వవిద్యార్థి
చదువుతోపాటు సంస్కారం
పాఠశాలలో విద్యార్థుల మానసికస్థాయికి అనుగుణంగా విద్యాబోధన ఉంటుంది. విద్యార్థిలో మానసిక, శారీరక వికాసాలు పెంచడమే ప్రధాన లక్ష్యం. పాఠ్యాంశాలలో భాగంగా దేశభక్తి, స్వాతంత్య్ర పోరాటం, చారిత్రక అంశాలు, నీతి కథలతోకూడిన విద్యను అందిస్తున్నాం. కాలాంశాలలో ప్రత్యేకంగా సదాచారం అనే పిరియడ్ కేటాయించి రామాయణం, భాగవతం, భగవద్గీత, మన సంస్కృతీసంప్రదాయాలు, పండుగలు, అంబేద్కర్, సీతారామారాజు, ఏకలవ్యుడు, లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుల జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తున్నాం.
– మంతటి క్రాంతికుమార్, సహాప్రధానాచార్యులు