మక్తల్ టౌన్ మార్చి 26: నూతంగా ఏర్పడ్డ మక్తల్ మున్సిపాలిటీని జిల్లాలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్ద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీలోని 9,6,5వ వార్డుల్లో ఎమ్మెల్యే చిట్టెం మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవలే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో వార్డుల్లో చేపడుతన్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలోని అన్నివార్డుల అభివృద్ధి లక్ష్యంతో రూ. 5కోట్ల తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో స్లమ్ ఏరియాలను గుర్తించి ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. త్వరలో మిగిలిన వార్డుల్లో మరిన్ని నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. డ్రైనేజీల నిర్మాణం అనంతరం అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతామన్నారు. రాంలీలా మైదానం గుండా డ్రైనేజీ పనులను సైతం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధ్దిని జీర్ణించుకోలేని బీజేపీ పెద్దమనుషులు పనులను నిలిపి వేయాలంటు కోర్టును అశ్రయించడం చూస్తుంటే వీరికి మక్తల్ అభివృద్ధి చెందడం ఇష్టం లేదని అర్థమవుతుందని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా అభివృద్ధి పనులను ఆపే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్ఠం చేశారు. మున్సిపాలిటీనీ అన్ని విధాలుగా అభివృద్ధిచేసి జిల్లాలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
శ్రీరామనవమిని వైభవంగా నిర్వహిస్తాం
శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 30న రాంలీలా మైదానంలో నిర్వహించే శ్రీరామనవమి వేడుకల కోసం ఆదివారం ఎమ్మెల్యే చిట్టెం, ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వేడుకలను కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఏఈ నాగశివ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా, లలితముదిరాజ్, ఆలయ అర్చకులు ప్రాణేశాచారి, కౌన్సిలర్లు నర్సింహులు, రాధికాశేషగిరి, మొగులప్ప, నాయకులు ఉమాశంకర్గౌడ్, శేషగిరి, మహమూద్, రాములు తదితరులు ఉన్నారు.