ఖిల్లాఘణపురం, డిసెంబర్ 12: సాగునీటితో వర్తక వ్యాపారం, రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కర్నెతండాలో ఎమ్మెస్సార్ ల్యాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న వృద్ధాశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెస్సార్ ల్యాబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సీఎస్ఆర్ నిధులు రూ.30లక్షలు మంజూరు చేసి వృద్ధ్దాశ్రమం నిర్మించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 64మండలాల్లో పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాలు వలసలకు నిలయంగా ఉండేవని, తెలంగాణ ఏర్పాటయ్యాక సాగునీరు పుష్కలంగా ఉండడంతో నేడు రెండు మండలాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయన్నారు.
త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటన
వనపర్తి జిల్లాలో త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పర్యటనకు ఖిల్లాఘణపురం మండలం నుంచి 10వేల మందికి తగ్గకుండా ప్రతి ఇల్లు తాళం వేసి వనపర్తిలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా కర్నెతండాకు చేరుకుంటారని అక్కడ కర్నెతండా లిఫ్ట్కు శంకుస్థాపన, పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన, వనపర్తిలోని మార్కెట్యార్డు ప్రారంభం, 400 డబుల్ బెడ్రూం ఇండ్లు, నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం 50వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్వర్గీయ తారకమ్మ పేరిట కామన్హాల్
తన మాతృమూర్తి సర్గీయ తారకమ్మ పేరుమీద స్మారకార్థం కర్నెతండాలో కామన్హాల్ ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తన కుమార్తెల సహకారంతో కామన్హాల్ నిర్మాణానికి నెలరోజుల్లో పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తిచేస్తామని చెప్పారు. కామన్హాల్ ఏర్పాటుతో కర్నెతండానే కాకుండా చుట్టు పక్కల తండాలు ఆముదం బండతండా, గార్లబండతండా, వెనకితండా, మేడిబాయితండా, బక్కతండా, ముందరితండా తదితర తండాలకు ప్రజలు వివాహ, శుభకార్యాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. అంతకుముందు తుల్జాభవానీ మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జిల్లాలోని రాజపేట గ్రామశివారులోని టీఆర్ఎస్ జిల్లా నూతన భవనాన్ని, చిట్యాల గ్రామ శివారులోని డబుల్బెడ్రూం ఇండ్లు, నూతన మార్కెట్ యార్డు పనులను మంత్రి, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నూతన వ్యవసాయ ల్యాబ్ భవన నిర్మాణ పనులను, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల పనులను, జిల్లా కేంద్రంలోని గంజిలో నిర్మాణమవుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించారు.
ఆశ్రమం..సమాజానికి ఆదర్శం
ఆశ్రమాలను నెలకొల్పడమే కాక ఆపన్నులకు అండగా నిలిచి ముందుకు సాగడం వల్ల సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాల శివారులోని చేయూత అనాథాశ్రమంలోని యువతి మానస వివాహానికి మంత్రి నిరంజన్రెడ్డి హాజరై ఆశీర్వదించారు. పెండ్లి కుమారుడు మాధవరెడ్డి ఆదర్శప్రాయుడని అమ్మాయి ఒంటరి కాదని తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, డీఎస్పీ కిరణ్కుమార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, తాసిల్దార్ రాజేందర్గౌడ్, ఎంపీపీ కృష్ణానాయక్, సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ రాజు, రాళ్లకృష్ణయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్, నాగవరం సహకార సంఘం చైర్మన్ మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, మహేశ్, సతీశ్, కృష్ణ, బండారు కృష్ణ , టీఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి, కోళ్ల వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, చెన్నరాయుడు, పెద్దిరాజు, రాము, సీతారాములు, తిరుమల్నాయడు, విష్ణుసాగర్, నరసింహ, మురళీసాగర్, నరేశ్, రమేశ్, డ్యానియల్, పాల్గొన్నారు.