శ్రీశైలం అక్టోబర్ 20 : శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవరోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి కాత్యాయనీ అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ దేవి నాలుగు చేతుల్లో వరముద్ర, పద్మం, అభయముద్రలు, ఖడ్గాన్ని ధరించి సకల శుభప్రదాయని కాత్యాయనిమాతగా భక్తులకు దర్శనమిచింది. కాత్యాయనీ అమ్మవారిని దర్శించడం వల్ల జన్మజన్మ పాపాలన్నీ హరింపబడతాయని పండితులు చెబుతున్నారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లను హంసవాహనంపై అధిష్టింపజేసి అర్చక వేదపండితులు విశేష పూజలు జరిపించారు. ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రజలతోపాటు దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మ హా సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రాకారోత్సవం, గ్రామోత్సవంలో భాగంగా పుష్పపల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి షోడశోపచార పూజాధికాలు చేశారు. కార్యక్రమం లో ఈవో పెద్దిరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏఈవో మో హన్, హరిదాస్ అధికారులు పాల్గొన్నారు.
అలంపూర్, అక్టోబర్ 20 : అలంపూరులోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు కాత్యాయనీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు శోడశోపచార, ప్రదోషకాల పూజలు, చంఢీహోమాలు, త్రిశతి అర్చన, సాయంత్రం సహస్ర నామార్చన, రాత్రి ఏడు గంటలకు దశవిధ హారతుల అనంతరం అమ్మవారు కాత్యాయనీగా దర్శనమిచ్చారు. ఆలయాలను భక్తులు అధికసంఖ్య లో దర్శించుకున్నారు.