బిజినేపల్లి, మార్చి 27 : నాగర్కర్నూల్ రేంజ్ పరిధిలోని బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి గ్రామాలను కలుపుకొని వేల ఎకరాల్లో అడవి విస్తరించి ఉన్నది. ఈ అడవిలో ఎన్నోరకాల జంతువులు జీవిస్తున్నాయి. వేసవిలో తాగడానికి నీరులేక సమీప పొలాల్లోకి వెళ్లి దాహం తీర్చుకుంటున్నాయి. గతంలో అటవీశాఖాధికారులు దాదాపు 23 ప్రాంతాల్లో జంతువులకు నీటిని అందించేందుకు సాసర్పిట్లను నిర్మించారు. వాటిని నీటితో నింపకపోవడంతో చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిలో ఎన్నో రకాల పండ్లను ఇచ్చే మొక్కలు ఉన్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో మొక్కలను పెంచేందుకు ప్లాంటేషన్ ఏర్పాటు చేసి రకరకాల మొక్కలను నాటారు. వీటితోపాటు ఫారెస్టులో ఉన్న రహదారి పొడవునా మొక్కలను నాటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలకు నీటిని అందించకపోవడంతో ఎండుమొఖం పట్టాయి. ఫారెస్టులోని జింకలు, నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జంతువులు తాగునీటి సౌకర్యం లేక అడవి సమీపంలోని పొలాలకు వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో చిన్నపాటి కుంట ఉండడంతో అక్కడే దాహం తీర్చుకుంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేక దాహంతో అలమటిస్తున్నాయి. దీంతోపాటు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ బోరు నిర్వహణ లేకపోవడంతో మరుగున పడింది. స్థానిక అటవీశాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జంతువులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అటవీ జంతువులకోసం నీటి సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అటవీ ప్రాంతంలో మూడు సోలార్ బోర్ల ద్వారా గుంతలను ఏర్పాటు చేసి జంతువులకు తాగునీటి కోసం నీటిని నింపుతున్నాం. సాసర్లలో నీటిని నింపనిమాట వాస్తవమే. సోలార్ బోర్ల ద్వారా మూడు ప్రాంతాల్లో గుంతలు తవ్వి నీటి సౌకర్యం కల్పిస్తున్నాం.
– ఫర్వేజ్ అహ్మద్, నాగర్కర్నూల్ రేయింజ్ అధికారి