సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ):మాదక ద్రవ్యాలు.. మాయదారుల్లో వచ్చి.. అడ్డదారుల్లో యువతను చేరి.. వారి జీవితాలను బలి తీసుకుంటున్నాయి. నిమిషాల మత్తుకు జీవితాన్ని తాకట్టు పెడుతోంది ఈ తరం. ఇటీవల డ్రగ్స్ కేసులు విస్తృతంగా వెలుగులోకి వస్తుండటంతో మన పిల్లలు ఎంత వరకు సేఫ్ అనే ఆందోళన మొదలైంది. శరీరాన్ని గుల్లజేసి ఆయుష్షును క్షీణింపజేసే డ్రగ్స్తో జరభద్రం అంటూ దివ్యాంగులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. జీవితం చాలా విలువైనది.. వృథా చేసుకోకండి అంటూ హితబోధ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకున్నారు. విధికాటుకు గురైన తాము దివ్యాంగులుగా అనేక సమస్యలను ఎదుర్కొన్నా, ఈ జీవితం గొప్పగా మార్చుకున్నామని తమ జీవిత విశేషాలను వివరిస్తున్నారు. మాదక ద్రవ్యాల అలవాటుతో కాళ్లు..చేతులున్నా.. పనికిరానివిగా చేసుకుంటున్నారని, డ్రగ్స్ బాధితులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు.
వైకల్యాన్ని లెక్కచేయకుండా సమాజ శ్రేయస్సు కోసం నడుం బిగించారు కొంతమంది దివ్యాంగులు. యువత భవిష్యత్ను తప్పుదోవ పట్టిస్తున్న మహమ్మారి డ్రగ్స్ను నిర్మూలించాలనే సంకల్పంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సమాజ అభివృద్ధికి మేము సైతం అంటూ కదం తొక్కారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శేఖర్, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న దేవికరాణి, పద్మ, సింధూరి డ్రగ్స్ నివారణకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలు, ర్యాలీల్లో పాల్గొని తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నగరంలో చేపడుతున్న పలు సామాజిక కార్యక్రమాల్లో వారు పాల్గొని డ్రగ్స్పై గళం వినిపిస్తున్నారు. మొత్తంగా డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకురావాలని వారు పిలుపునిచ్చారు.
జీవితాన్ని వృథా చేసుకోవద్దు
చాలా మంది యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలను నష్టపోతున్నారు. వారి లక్ష్యాలను మరిచిపోయి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారు బయటకు రాలేకపోతున్నారు. వారికి సరైన గైడెన్స్ దొరకడం లేదు. నగరాల్లో డ్రగ్స్ బాధితులు చాలా మంది ఉంటున్నారు. పేరేంట్స్ అప్రమత్తమై తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలి. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నాం. అనేక అవరోధాలను తట్టుకుని జీవితంలో లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మాలాంటి వాళ్లు కృషి చేస్తుంటే.. ఆ దేవుడు మీకిచ్చిన జీవితాన్ని వృథా చేసుకోవద్దని కోరుకుంటున్నాం.
అన్ని పాఠశాలలకు వెళ్తాం..
డ్రగ్స్ తీసుకుంటూ కొంతమంది విద్యార్థులు తమ లక్ష్యాలను మరిచిపోతున్నారు. అది చాలా ప్రమాదకరం. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితంలో ఏమీ సాధించలేము. ఆరోగ్యం పాడుచేసుకోవడమే మిగులుతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మనం చేసే కార్యక్రమాల ద్వారా కొందరైన మారితే అదే మాకు సంతృప్తి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు చేసినా డ్రగ్స్పై అవగాహన చేస్తున్నాం. నగరంలో విద్యాలయాలన్నిటిలో డ్రగ్స్పై అవగాహనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు..
విలువైన జీవితాన్ని మత్తు కో సం తాకట్టుపెట్టొద్దు. విద్యార్థులు, యువకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. చెడు స్నేహానికి దూరం గా ఉండాలి. డ్రగ్స్ బాధితులను సైక్రియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లి మాన్పించేలా కృషి చేయాలి. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గమనించాలి. మేము డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. కాలేజీలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటేనే వంద శాతం నిర్మూలించగలం.
సమస్యతో కలబడి నిలబడుదాం..
కాళ్లు, చేతులు పనిచేయకపోయినా.. ఆ కష్టం మమ్మల్నీ ఎంత తీవ్రంగా వెనక్కి లాగుతున్నా వాటన్నింటిని పక్కకుబెట్టి అనుకున్న లక్ష్యం వైపునకు నడుస్తున్నాం. సమస్య వచ్చిందని భయపడి జీవితాన్ని ముగించాలని అనుకోవద్దు. మాదక ద్రవ్యాల అలవాటుతో కాళ్లు చేతులున్నా.. పనికిరానివిగా చేసుకుంటున్నారు. ఆ అలవాటు నుంచి బయటకు వచ్చి లక్ష్యంపై దృష్టి సారించాలి. దివ్యాంగుల కళాయాత్రతో సామాజిక అంశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నాం.