బాలనగర్, జనవరి 2: బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్నివర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడి విమర్శించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 80మంది లబ్ధిదారులకు సుమారు రూ.81 లక్షల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో నేటివరకు రూ.12కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే.. బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అంతకుముందు మండలంలోని (9)మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.8.40 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, ఏఎంసీ చైర్ పర్సన్ రజిని, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మన్ నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, వర్కింగ్ మండలాధ్యక్షుడు బాలునాయక్, యూత్ వింగ్ మండలాధ్యక్షుడు ప్రకాశ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
30పడకల దవాఖాన పనుల పరిశీలన
జడ్చర్ల, జనవరి 2: మండలంలోని పెద్దఆదిరాల వద్ద నిర్మిస్తున్న 30పడకల పీహెచ్సీ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దవాఖాన పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణంలో ఎలాంటి రాజీలేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమాలలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణిల్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ
నవాబ్పేట, డిసెంబర్2: మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు(జాతర)కు సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, మైసమ్మ ఆలయ తాజామాజీ చైర్మన్ పాశం గోపాల్, నాయకులు పాశం కృష్ణయ్య, నర్సింహులు పాల్గొన్నారు.