మాగనూర్, మే 31 : నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామంలో అడవిసత్యారం పెద్దవాగు ఇసుక తరలింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. ఒకే పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఇసుక రీచ్ను నడిపిస్తుండగా వడ్వాట్ గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు అడ్డు చెప్పడంతో ఆదివారం దుప్పలి ఆశప్ప, బాలగారి శంకర్ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అడవిసత్యారం పెద్ద వాగు నుంచి ఆన్లైన్ పేరిట అడ్డూ అదుపు లేకుండా అధికార పార్టీ నేతలు నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు.
ఇదే క్రమంలో నేతల మధ్య ఇసుక రవాణాపై నెలకొన్న విబేధాలు తీవ్ర రూపం దాల్చి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు యత్నించినట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన నాయకులు ఇసుక వ్యవహారంలో పరస్పరం తలపడటంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు శాంతిభద్రతల సమస్యకు దారితీయడం ఆందోళన కలిగించే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అడవిసత్యారం పెద్దవాగు ఇసుక రీచ్ల నుంచి ఇసుక తరలించే విషయంపై దుప్పలి ఆశప్ప, బాలగారి శంకర్ వర్గాలు పరస్పర దాడులకు పాల్పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఘటన అనంతరం ఇరువర్గా లు పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా రెండు వర్గాలకు చెందిన మొత్తం 24మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్బాబు తెలిపారు.