నాగర్కర్నూల్, జూన్ 1 : నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానికి పరుగుతీశారు. దీంతో డీజిల్ స్టాక్ ఉన్న ఒకే బంకుల్లో (పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే..) వాహనదారులు, రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులుదీరారు.
పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో మాత్రమే డీజిల్ ఉండడంతో పో లీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వైపున కు ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు క్యూకట్టాయి. దాదాపు రెండు, మూడు గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. పెద్ద మొత్తంలో వాహనాలన్నీ రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

06
జిల్లాలోని బంకులకు సోమవారం రావాల్సిన స్టాక్ సమయానికి రాకపోవడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రద్దీ ఏర్పడింది. నల్లవెల్లి రోడ్డులో ఉన్న సబ్జైల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో సైతం డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతులు డీజిల్ కోసం గంటల తరబడి ఎదురుచూశారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచేందుకే కొరత సృష్టిస్తుందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పంటల సాగు సీజన్ ప్రారంభంలో ట్రాక్టర్లు, ఇతర యంత్రాలతో దుక్కులు దున్నుకునే సమయంలో ఇలా డీజిల్ కొరత సృష్టించడం తగదని రైతులు పేర్కొంటున్నారు. వెంటనే డీజిల్ కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు, వాహనదారులు కోరారు.
పేట జిల్లా ఊట్కూరులోనూ పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్నది. మండల కేంద్రంలోని రెండు బంకుల వద్ద వాహనదారులు, కస్టమర్లు క్యూ కట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య గంటల తరబడి క్యూలో నిలబడగా.. డీజిల్ దొరికింది.