తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పరిష్కారం కాని సమస్యలు నేడు తీరాయి. గట్ల పంచాయితీలు తొలగాయి. ఈజీగా స్లాట్ బుకింగ్ చేసుకొని క్షణాల్లో రిజి స్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మ్యుటేషన్ రికార్డుల్లో నమోదు చేసి వెంటనే పాస్ పుస్తకాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. కాలయాపన.. అధికారుల చేతివాటం లేదు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి గత నెల ఏప్రిల్ వరకు 56,897 స్లాట్లు బుకింగ్ కాగా.. 56,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. దీంతో రైతన్నకు ధరణిపై భరోసా పెరిగింది.
ధరణి సేవలు బాగున్నాయి..
నాకు ఇద్దరు కొడుకులు. నిరుపేద కుటుంబం. పైసా పైసా కూడబెట్టి రెండు గుంటలను నెలివిడి గ్రామానికి చెందిన రైతు వద్ద కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాను. తాసీల్దార్ కార్యాలయంలో కేవలం రెండు రోజుల్లోనే భూమిని నా పేరు మీదకు మార్చారు. చదువు రాదు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని దిగులు పడుతుంటే అధికారులు ధైర్యం చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం గతంలో చాలా ఇబ్బందులు పడేటోళ్లం. ధరణితో రిజిస్ట్రేషన్ సులభమైంది. మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని, ఇచ్చిన తేదీన తాసీల్దార్
కార్యాలయానికి వెళ్తే నిమిషాల వ్యవధి లో రిజిస్ట్రేషన్ అవుతుంది.
– బారయ్య గౌడ్, నర్సింగాపురం, మదనాపురం
ఉమ్మడి పాలనలో పాలకులు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. నాడు వ్యవసాయం దండుగ అన్న తెలంగాణను ప్రభుత్వం.. నేడు దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసింది. రైతుకు అన్నివిధాలా అండగా ఉంటూ భూ సమస్యల పరిష్కారానికి ‘ధరణి’ని తీసుకొచ్చింది. దీంతో భూ సమస్యలు తీరి క్షణాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ వంటివి రికార్డులో పొందుపర్చడంతోపాటు వెంటనే పాసు పుస్తకాలను అందిస్తున్నది.
– వనపర్తి, మే 29
గెట్ల సమస్యలు ఉండి భూ రికార్డులో పేర్లు మారక ఇరువర్గాలు కొట్టుకొని పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషుల మధ్యలో పంచాయితీలు పెట్టి పేపర్లు రాసుకున్నా.. చివరికి అన్నదాతలు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. భూ తల్లిని నమ్ముకొని సేద్యం చేసే రైతన్నలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ధరణి’ పథకానికి శ్రీకారం చుట్టింది. భూమి తన పేర మారలేదని.. సాగు వదిలి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా.. స్లాట్ బుక్ చేసుకొని.. ఇచ్చిన తేదీ ప్రకారం కార్యాలయాకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ధరణి స్పెషల్..
సీఎం కేసీఆర్ మంచి పని చేసిండు
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఇంతకుముందు తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పని అయితలేకుండే. సీఎం కేసీఆర్ సార్ ధరణి పథకం తీసుకొచ్చి శాన మంచి పని చేసిండు. నేను రెండెకరాల 10 గుంటల భూమిని విరాసత్ పట్టా నుంచి పొందాను. వారసత్వంగా చేసుకుంటే రిజిస్ట్రేషన్ సులభంగా అయింది. ఎవరినీ వెంటపెట్టుకోకుండా నేనే స్వయంగా వెళ్లి స్లాట్ బుక్ చేసుకున్నాను. 10నిమిషాల్లో పని అయిపోయింది.
– చిన్న కురుమయ్య, రైతు, నిజాంబాద్,
పాన్గల్ మండలం గతంలో ఇబ్బందులు పడినం
గతంలో భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోనిక్కె తాసీల్దార్ కార్యాలయం చుట్టూ 15 రోజులపాటు తిరిగేవాళ్లం. భూమి కొన్నాక వీఆర్వోకు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్ఐ, వీఆర్వో వచ్చి గ్రామంలో విచారణ చేసి తాసీల్ కార్యాలయంలో రికార్డుల్లో పేర్లు రాసేందుకు దాదాపు 15 రోజులు పట్టేది. ధరణి పోర్టల్ ద్వారా భూమి కొన్న వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకున్న మరుసటి రోజు గంట వ్యవధిలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తరువాత నేరుగా ఇంటికే పట్టా పాసుపుస్తకం వస్తుంది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ధరణి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసిండు. భూములు కొనుగోలు చేసిన అందరూ.. సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ప్రతిపక్షాలకు కడుపుమండడం విడ్డూరంగా ఉంది.
– ఏ. రాంరెడ్డి, రైతు, మిరాశిపల్లి గ్రామం, కొత్తకోట మండలం
చాలా సంతోషంగా ఉంది
తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన గంటలోపే రిజిస్ట్రేషన్ కావడంతో చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయేవారు. అది గుర్తుకొచ్చి నా భర్త తన పేర కాకుండా నా పేర రిజిస్ట్రేషన్ చేసుకొమ్మని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సార్ రైతులు ఇబ్బంది పడొద్దని ధరణి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సులభంగా రిజిస్ట్రేషన్ అవుతుందని తెలిసింది. గతంలో పాసు పుస్తకాల కోసం అధికారులు డబ్బులు తీసుకోగా.. ఇప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా పాసుపుస్తకం నేరుగా ఇంటికే వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం మరోసారి రావాలి.. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
– సుమిత్ర, మహిళా రైతు, కొత్తకోట మండలం
ధరణితో ధైర్యం పెరిగింది
ఒకప్పుడు విరాసత్ లేదా కొనుగోలు చేసి ఒకరి పేరు నుంచి మరొకరి పేర భూమి మార్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్ సులభమైంది. అందుబాటులోని మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని, ఇచ్చిన తేదీ ప్రకారం తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే గంట వ్యవధిలోనే మన పేర భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. దీంతో రెవెన్యూ అధికారులు వివరాలను రికార్డుల్లో నమోదు చేసి డిజిటల్ పాసుపుస్తకాలను అందజేస్తున్నారు. ధరణితో రైతుకు ఉపయోగమే తప్పా.. ఇబ్బందులు మాత్రం లేవు.
భూ సమస్యలకు చెక్..
ధరణితో భూ సమస్యలకు పరిష్కార మార్గం సుగమమైంది. ఈ పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే రైతులు ముందుగా దగ్గరలోని మీసేవ, నెట్ సెంటర్లో స్లాట్ బుకింగ్ చేసుకొని అందుకు సంబంధించిన చలాన్ను ఆన్లైన్లో చెల్లించాలి. వారు ఒక తేదీని ఇస్తారు. ఆ రోజున ఇచ్చిన సమయానికి సదరు మండల కార్యాలయానికి వెళ్తే సంబంధిత పత్రాలన్నింటినీ పరిశీలించి తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా మ్యుటేషన్ చేసి వెంటనే పత్రాలను అందజేస్తున్నారు. క్షణాల్లో పేరు మార్పిడి, మ్యుటేషన్ చేసి వారంలోనే పాసు పుస్తకాలను ఇవ్వడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతకు భరోసా..
పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం ధరణితో రైతన్నలకు భరోసానిస్తున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగడంతో, ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ఈ సేవలు తాసీల్దార్ కార్యాలయంలో అందుబాటులోకి రావడంతో రైతులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కార్యాలయం తెరిచే సమయానికి వెళ్తే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి చేసుకొని తమ పనులను యథావిధిగా చేసుకుంటున్నారు.
20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్..
మాది పెబ్బేర్ మండలం, గుమ్మడం గ్రామం. నేను తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్తో భూమిని కొన్నా. కేవలం 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేశారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకొని అన్ని పేపర్లు, సాక్షులతో తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. మొత్తం పని పూర్తి కావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. గతం లో వనపర్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే దాదా పు 10 రోజుల తర్వాత గానీ డాక్యుమెంటు చేతికి వచ్చేవి కాదు.
– జానంపేట శాంతన్న, గుమ్మడం గ్రామం, పెబ్బేర్ మండలం
ధరణి ప్రభుత్వానికి, రైతును అనుసంధానం చేసే సౌకర్యవంతమైన పథకం. దీని వల్ల భూమి క్రయ, విక్రయ అంశాలను తక్కువ సమయంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంది. స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రెవెన్యూ డివిజిన్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మండలకేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలోనే పూర్తి చేసుకోవచ్చు. మధ్యవర్తుల అవసరం లేకుండా, అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నది. ధరణి సేవలను వినియోగించుకునేలా ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి.
– కానమోని బాలపీర్, వీపనగండ్ల మండలం
వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం
భూమి క్రయ, విక్రయాలు, వారసత్వం చేయించుకునే వారంతా దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. వెంటనే తేదీని అక్కడ చూపిస్తారు. ఆ తేదీన సంబంధిత పత్రాలతో తాసీల్దార్ కార్యాలయానికి సాక్షులతో రావాలి. ధ్రువపత్రాలను పరిశీలించి తక్షణమే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా కార్యాలయంలో సంప్రదించాలి. మధ్యవర్తులను నమ్మి డబ్బు వృథా చేసుకోవద్దు.
పేద రైతులకు వరం
ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. గతంలో పట్టాదారుడు లేకున్నా ఆ పొలాన్ని దొడ్డిదారిన ఇంకో రైతుకు రిజిస్ట్రేషన్ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. నా పేర ఉన్న పొలాన్ని నేను వెళ్లి వేలిముద్ర పెడితే తప్పా.. మరొకరి పేర రిజిస్ట్రేషన్ కాకుండా చేసిండ్రు. దీనివల్ల దొంగ రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్ అయినయ్. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 2 నెలలు పట్టేది. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న తక్షణమే రిజిస్ట్రేషన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విలువైన భూములు దొడ్డి దారుణ రిజిస్ట్రేషన్ కాకుండా ‘ధరణి’ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– బొడ్డు స్వామి రెడ్డి, లక్ష్మిపల్లి గ్రామం, చిన్నంబావి మండలం
దళారుల దందా బంద్
ధరణితో దళారుల దందా బంద్ అయ్యింది. రెవెన్యూలో లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు భూములు రిజిస్ట్రేషన్ సమయంలో, రికార్డుల్లో పేర్లు నమోదు చేసేటప్పుడు రైతులను నిలువు దోపిడీ చేసేటోళ్లు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్తో నేరుగా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్తోపాటు డిజిటల్ పాసుపుస్తకాలు పొందడం సులభంగా మారింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది.
భూ సమస్యలకు మార్గం సుగమం..
ధరణితో భూ సమస్యలకు మార్గం సుగమమైంది. ఈ పథకం వల్ల భూములు భద్రంగా ఉంటాయి. నాకు సంబంధించిన రెండెకరాల భూమి నిషేధిత జాబితాలో పడగా, మీసేవలో దరఖాస్తు చేసుకున్నా. తాసీల్దార్ విచారణ చేసి పట్టా భూమిగా మార్చిండు.
– తాళ్ల వెంకటయ్య, రేవల్లి మండలం
ఒక్కరోజులో పూర్తయింది
ధరణి సేవలు చాలా బాగున్నాయి. నా పేరు మీదకు 10గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు శనివారం మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నాను. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. కేవలం పది నిమిషాల్లోనే తాసిల్దార్ సార్ వచ్చి అన్ని పత్రాలను చూసిండు. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ చేశారు.
– ముడావత్ స్వరూప, కిష్ణాపూర్ తండా,
పాన్గల్ మండలం, వనపర్తి జిల్లా ధరణి వచ్చినంక సులువైంది
ధరణి వచ్చినంక రిజిస్ట్రేషన్ చాలా సులువైంది. నేను సోమ్యానాయక్ వద్ద 3 గుంటల భూమిని కొన్నా. నా పేర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికని మొన్న స్లాట్ బుక్ చేసుకోగా.. ఒకరోజు తర్వాత తేదీ ఇచ్చారు. ఆ రోజు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. పొద్దుగాల ఆఫీసుకు పోయి మధ్యాహ్నం కల్లా పని పూర్తిచేసుకొని బయటికి వచ్చిన.
– సుభావత్ సరోజ, కర్ణమయ్యకుంట తండా, గోపాల్పేట మండలం