గద్వాల/మల్దకల్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జనాభా ప్రాతిపదికన మూడు నెలలకోసారి ప్రభుత్వం ‘పల్లెప్రగతి’ కింద నిధులు విడుదల చేయడంతో గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. సీమాంధ్రపాలనలో గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల్లోనే వనరులు సమకూర్చుకునేలా చర్యలు చేపట్టారు. గతంలో గ్రామాల్లో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేవారు. సరైనా నీటివసతి ఉండేకాదు, మనిషి చనిపోతే పూడ్చాలంటే సరైనా స్థలం ఉండేది కాదు. రైతులు ఒకచోట సమావేశం కావడానికి ఎలాంటి వేదికలు లేకపోవడంతో గ్రామాల్లోని దేవాలయాలు లేదా ఇతర ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వారు. స్వరాష్ట్ర పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడానికి పూనుకోవడంతో ప్రస్తుతం ప్రతి గ్రామం అన్నిరంగాల్లో దూసుకపోతున్నాయి. జోగుళాంబగద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం మద్దెలబండ ప్రభుత్వం, గ్రామస్తుల సహకారంతో మస్త్ అభివృద్ధి చెందింది. మద్దెలబండ గ్రామపంచాయతీ అభివృద్ధిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
రూ.3కోట్లతో అభివృద్ధి
మద్దెలబండ గ్రామపంచాయతీలో దాదాపు రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామంలో 3వేల జనాభా ఉండగా 2400మంది ఓటర్లు ఉన్నారు. 90శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 700ఇండ్లకు మిషన్భగీరథ నల్లాలు ఏర్పాటు చేశారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి మురుగునీరు రాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు చేశారు. దీంతోపాటు గ్రామపంచాయతీలో సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లి ఒకచోట వేయడానికి సెగ్రిగేషన్ షెడ్డు, శ్మశానవాటికను రూ.12.80లక్షలతో ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ జయమ్మ సుమారు రూ.40లక్షల విలువగల రెండెకరాల 20గుంటల భూమిని కొనుగోలు చేసి శ్మశానవాటిక, వైకుంఠధామం ఏర్పాటు చేశారు. రూ.40లక్షలతో సీసీరోడ్లు, రూ.10లక్షలతో డ్రైనేజీలు నిర్మించారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకును రూ.9లక్షలతో కొనుగోలు చేశారు. రూ.22లక్షలతో రైతువేదిక, రూ.20లక్షలతో పేదలకు ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించారు. పంచాయతీ స్థలంలో రూ.30లక్షలతో 11దుకాణాలు నిర్మించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గ్రామంలోని పాఠశాలలో అదనపు తరగతి గదులకు రూ.18లక్షల నిధులు కేటాయించడంతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు జెడ్పీ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులకు ప్రభుత్వం రూ.55.75లక్షలు కేటాయించగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.41లక్షలు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. రూ.5లక్షలతో చావిడి నిర్మాణం చేశారు. గ్రామీణ క్రీడాప్రాంగణంతోపాటు మూడు పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. మండలంలోనే మద్దెలబండ గ్రామం ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకుపోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి
ప్రభుత్వం, గ్రామస్తుల సహకారంతో గ్రామపంచాయతీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పల్లెప్రగతి, పంచాయతీ నిధులు సుమారు రూ.3కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. వాటిని కూడా త్వరలో పూర్తిచేస్తాం. జిల్లాలోనే అభివృద్ధిలో ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నావంతు కృషిచేస్తున్నాను. సొంత నిధులతో రెండెకరాల్లో వైకుంఠధామం నిర్మించాం.
– జయమ్మ, సర్పంచ్, మద్దెలబండ