గట్టు, మార్చి 19 : ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. పనిలేని ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు ఆయన సూచించారు. గట్టులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యంగా పెట్టుకొని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని, తిప్పి కొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వానిదే తప్పని ప్రచారం చేస్తున్నాయన్నారు. వాస్తవాలను నిరుద్యోగులకు, ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతను శ్రేణులు తీసుకోవాలన్నారు. దేశంలో మరెక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని, అన్ని రాష్ర్టాలు మన వైపే చూస్తుంటే కండ్లులేని కబోదుల్లా బీజేపీ, కాంగ్రెస్లు పథకాలపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.
పార్టీలో ఏర్పడే చిన్న చిన్న మనస్పర్థలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పూర్తిస్థాయి సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేగా తాను కృష్ణమోహన్రెడ్డినే చూస్తున్నానని, ఇది అసాధారణ విషయమని కొనియాడారు. రాత్రింబవళ్లు ప్రజల కోసమే పనిచేసే ఎమ్మెల్యే బండ్లను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి స్పష్టంగా కనబడుతుందన్నారు.
వలసలకు మారుపేరుగా ఉన్న గట్టు మండలంలో నేడు పరిస్థితులు మారిపోయాయని.. అందుకు ప్రభుత్వ పథకాలే కారణమని పేర్కొన్నారు. గతంలో పాలకులు సాగు దండుగ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్, సాగునీటి వనరులతోపాటు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించిందన్నారు. గట్టు మండలానికి వివిధ పథకాల కింద ఈ నాలుగేండ్లలో రూ.380కోట్లు ఖర్చు చేశామన్నారు.
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరవేస్తూ వెళ్తే బీఆర్ఎస్కు ఎదురే ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మార్కెట్యార్డు చైర్మన్ శ్రీధర్రెడ్డి, జిల్లా గ్రంథాలయసం స్థ చైర్మన్ జంబు రామన్గౌడ్, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ బాసు శ్యామ ల, సర్పంచ్ బాసు హనుమంతు, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, నా యకులు పాల్గొన్నారు.