కోస్గి, నవంబర్ 13 : రేవంత్రెడ్డి అవకాశవాది అని, ప్రజల జీవితాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీ నర్సింహారెడ్డి గార్డెన్లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సమ్మేళనానికి గనుల, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి హోంమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం మీ వెంటే ఉంటూ మీ బాగుకోసం ఆలోచించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. గతంలో ఏ పార్టీ కూడా మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన నాటి నుంచి మైనార్టీలకు పెద్దపీట వేసి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకొని చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డివి ఉట్టి మాటలే తప్పా చేసేది శూన్యమన్నారు. అబద్ధపు మాటలు..
మోసాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, నమ్మి మోసపోతే గోసపడుతామన్నారు. పార్టీలు మారుతూ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టే వారిని నమ్మొద్దని కోరారు. మతాలు, కులాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఇలాగే ఉండాలంటే మరోసారి బీఆర్ఎస్ సర్కారే రావాలన్నారు. మసీదుల్లో ఉండే మౌజామ్, ఇమాంలకు ప్రతి నెలా రూ.5వేల గౌరవ వేతనాన్ని అందిస్తున్నదని, ఇప్పటి వరకు రూ.304కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రూ.10వేలకు పెంచే హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని సార్లు ధర్నా చేసినా మౌజామ్, ఇమాంలను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మైనారిటీ పాఠశాలలను ఏర్పాటు చేసి లక్షా 40వేల మంది విద్యార్థులకు రూ.3,300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నేడు కార్పోరేట్ తరహాలో విద్య అందిస్తున్నట్లు వెల్లడించారు. 2,520మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజినీర్ వంటి ఉన్నత చదువులను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా నిలబెట్టుకొని తెలంగాణకు బంగారు బాటలు వేసుకుందామని తెలిపారు.
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, మరింత అభివృద్ధి కావాలంటే సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కావాలని గనులు, భూగర్భజల వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ కూడా మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీకే రాష్ట్రంలో గ్యారెంటీ లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఇక్కడిచ్చే హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.13కోట్లతో మసీదుల పునరుద్ధరణ, ఈద్గాల నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.150కోట్లు మైనారిటీ రుణాలు మంజూరు చేశామన్నారు. కోస్గిలో 5ఎకరాల్లో వైకుంఠధామం స్థలం, రూ.10లక్షలతో ప్రహరీ, ఈద్గాకు రూ.15లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. మైనార్టీ గురుకుల భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ సలీం, ఎన్నికల ఇన్చార్జి లింగంపల్లి కృష్ణారావు, వక్ఫ్బోర్డు చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్యాసం రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీషరాజేశ్ తదితరులు పాల్గొన్నారు.