నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి పరుగులు పెడుతున్నది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంపూర్, గద్వాల నియోజకవర్గాల రూపురేఖలే మారిపోయాయి. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం ప్రత్యేక చొరవ తీసుకోవడం, నడిగడ్డపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉండడంతో ప్రగతికి కేరాఫ్గా మారింది. ఇక్కడి అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు సైతం నోరు మెదపడం లేదు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు విడుతల వారీగా కల్పిస్తున్నారు. నూతనంగా రూ.52 కోట్లతో కలెక్టరేట్, రూ.38 కోట్లతో ఎస్పీ కార్యాలయాలను నిర్మించారు. వీటిని 12వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రగతి ప్రదాత రాకకోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.
గద్వాల, జూన్ 10 : జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటుతో నవశకానికి నాంది పడింది. ప్రజలకు పాలన చేరువ కాగా, పనుల్లో పారదర్శకత నెలకొన్నది. దీంతో అభివృద్ధివైపు అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పరిపాలన ప్రజల చెంతకే వచ్చింది. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. జిల్లాగా ఏర్పడిన తర్వాత సుమారు 36 శాఖల అధికారులు ప్రజలకు 50 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు ఏర్పడగా, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాగే విద్య, వైద్యపరంగా ఎంతో మెరుగుపడింది.
కలెక్టరేట్, ఎస్పీ భవనాలు
గద్వాల ఏర్పాటు తర్వాత ప్రజలకు పాదర్శక పాలన అందుతున్నది. అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ కా ర్యాలయాల భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం నిర్మించారు. రూ.52 కోట్లతో కలెక్టరేట్, రూ.38 కోట్లతో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించారు. వీటిని 12వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.18కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
జిల్లాలో సాగునీరు పుష్కలమైంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువగా కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. పండించిన కూరగాయలు విక్రయించడానికి సరైన మార్కెట్ లేకపోవడంతో దళారులకు విక్రయించేవారు. ఇది గ్రహించిన ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు బ్లాక్లలో నిర్మాణం జరుగుతుండగా.. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వెజిటేబుల్, సూపర్ మార్కెట్, చేపల మార్కెట్, ఫుడ్కోర్టు, పూలు, పండ్లు అమ్ముకునే వారికి ప్రత్యేకంగా దుకాణాలు నిర్మిస్తున్నారు.
ఇండోర్ ఆడిటోరియం
జిల్లా కేంద్రంలో ఏవైనా సమావేశాలు, విద్యార్థులకు అవసరమైన ప్రోగ్రాంలు నిర్వహించాలంటే సరైన సౌకర్యాలు ఉండేవి కావు. అయితే జిల్లా కేంద్రంలోని నల్లకుంటలో మల్టీపర్పస్ ఇండోర్ ఆడిటోరియాన్ని రూ.6.25 కోట్లతో నిర్మిస్తుండగా, పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇండోర్ గేమ్స్తోపాటు పట్టణానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇతర ప్రభుత్వ, ప్రజలకు ఉపయోగంగా ఉండేలా నిర్మిస్తున్నారు.
సెంట్రల్ లైటింగ్
జిల్లా కేంద్రంలో రూ.11.90 కోట్లతో సెంట్రల్ లైటింగ్తోపాటు వ్యర్థాల శుద్ధికేంద్రం, రెండు వైకుంఠధామాలు, ఎల్పీజీ డబుల్ సిలిండర్ బర్నింగ్ క్రిమిటోరియం ఏర్పాటు, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, 39 స్ట్రీట్ వైండింగ్ దుకాణాలు, 15 పబ్లిక్ టాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డంప్యార్డు నిర్మాణం, ప్రతి వార్డులో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు, వాటిలో ఓపెన్జిమ్లు, స్మృతివనం, సంఘాల చెన్నకేశవ పార్కు నిర్మించారు. వీటితోపాటు రూ.56 కోట్ల సీఎం అభివృద్ధి నిధులతో పనులు చేపట్టారు. జూరాల వద్ద రూ.15 కోట్లతో బృందావనం గార్డెన్ నిర్మిస్తున్నారు.
పీజీ కళాశాల విద్యార్థులకు హాస్టల్
పీజీ కళాశాల జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో ఉండడం.. అక్కడ వసతిగృహం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సీఎం కేసీఆర్కు విన్నవించడంతో వసతిగృహం కోసం రూ.10కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం రెండు వసతి గృహాలను ని ర్మిస్తున్నారు. అలాగే జూనియర్ కళాశాల నూతన భవనం రూ.1.50కోట్లతో, డిగ్రీ కళాశాలలో అదనపు గదులు రూ.80లక్షలతో నిర్మిస్తున్నారు.
నూతన బస్స్టేషన్
గద్వాల పాత బస్స్టేషన్ చిన్నగా ఉండి పెచ్చులూడి పడుతుండడంతో ప్రస్తుతం కొత్తగా రూ.4 కోట్లతో 15 ప్లాట్ఫాంలతో నిర్మిస్తున్నారు. పాస్ కౌంటర్, కంప్యూట ర్ గది, సేద తీరడానికి గదులు నిర్మిస్తున్నారు.
వ్యవసాయ, మత్స్యశాఖ
జిల్లాలో వ్యవసాయ ఉద్యానవన రంగాలకు ప్రభుత్వం ప్రాముఖ్యతనిచ్చింది. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి విస్తరణ అధికారులను నియమించి రైతువేదికలను ఏర్పాటు చేసింది. 1,56,282 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.224 కోట్ల రైతుబంధు జమ చేసింది. రైతుబీమాతో 2,467 కుటుంబాలకు రూ.123.35 కోట్ల పరిహారం అందింది. ఉద్యానవన శా ఖ స్ప్రింక్లర్ల సేద్యం కోసం రూ.1,206 లక్షల వ్యయంతో 1,417 మంది రైతులు లబ్ధి పొందారు. ఐఎఫ్డీఎస్ పథకంలో జిల్లాలో మత్స్య కారులకు రూ.10 కోట్లతో వలలు, తెప్పలు, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను వంద శాతం సబ్సిడీపై అందజేశారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో పచ్చదనం
గద్వాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే తలంపుతో రూ.581 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ప్రసుత్తం పను లు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 48,254 మం ది వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రూ.84.16 కోట్లు ఖర్చు చేశారు. రూ.2 కోట్లతో విద్యుత్ ఎస్ఈ కార్యాలయాన్ని నిర్మించారు.
మిషన్ భగీరథతో…
ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయించింది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 311 ఆవాసాలు, నాలుగు మున్సిపాలిటీలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 334 కొత్త ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించారు. 1388.95 కిలో మీటర్ల మేర పైపులైన్లు వేసి 1,37,959 నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
రెండు పడకల గదులు
జిల్లాలో 1,300 డబుల్ బెడ్రూం ఇండ్లను రూ.68.90 కోట్లతో నిర్మించారు. 715 నిర్మాణాలు పూర్తవగా.. లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన ఇండ్లను త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఆర్అండ్బీ, చేనేత, జౌళీ శాఖ
జిల్లాలో తొమ్మిది బ్రిడ్జి పనులకు రూ.46 కోట్లు మంజూరు కాగా పనులు సాగుతున్నాయి. అలాగే రూ.47.15 కోట్లతో 8 రోడ్డు పనులు ప్రారంభించగా, అందులో ఐదు పూర్తయ్యాయి. చేనేత మిత్ర పథకంలో 5,826 మంది కార్మికులు, అనుబంధ కార్మికులకు రూ.5కోట్ల 92లక్షలు నూలు సబ్సిడీ జమ చేశారు. జెడ్పీ నిధుల నుంచి రూ.4కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాల్ నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఆర్వోబీని రూ.25కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు.