ఆత్మకూరు, నవంబర్ 26 : ఇన్నాళ్లు కండ్లబడని వారందరూ ఊర్లకు వచ్చి ఓట్లు అడుగుతుంటె టెన్షన్ పడకండి, కారు గుర్తుకు ఓటేసి మా వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, మేడెపల్లి, దేవరపల్లి, తిప్డంపల్లి, రేచింతల, వీరరాఘవపూర్, తూంపల్లి, కత్తెపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్షో సభలో ఆయన మాట్లాడుతూ 60 ఎండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో భూములు బీడుపడి ఉండేవని, రైతులు కూలీలు వలసలు పోవడంతో ఇండ్లకు తాళాలు కనిపించేవి, పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన మార్పును ప్రజలు గుర్తించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో పల్లెల్లో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అమలుకాని స్కీములు, స్కాములన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, భరోసా అని పేర్కొన్నారు.
ఎన్నికలయ్యాక కండ్లకు కూడా కనిపించకుండా పారిపోయే పార్టీలకన్నా నిత్యం మీ మధ్యనే ఉంటూ మీ మంచిచెడులు చూస్తూ ఉండే బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఎలక్షన్ కమిషన్ రైతుబంధు డబ్బుల విడుదలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్నారు. త్వరలోనే రైతుబంధు డబ్బులు విడుదల చేస్తామని, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ఎప్పటిలాగా డబ్బులు పడతాయన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఆత్మకూరు ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తానని హామీనిచ్చారు. ప్రచార పర్వంలో భాగంగా ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామన్నకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మికాంత్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.