మమబూబ్నగర్, సెప్టెంబర్ 14 : ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు అనే తేడా లేకుండా విష జ్యరాలతో బాధపడుతున్న వారితో నిండిపోయాయి. పది రోజులుగా జనరల్ దవాఖానకి వచ్చే రోగుల సంఖ్య 1600 నుంచి 2 వేల వరకు పెరిగింది. ప్రైవేట్ దవాఖానలో కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో చాలా మంది డయేరియా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) మెరుగైన వైద్యం అందక జనరల్ దవాఖానను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ సాధారణ జ్వరాలు, ఒంటి నొప్పులు ఇతర సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. అయితే నిత్యం ఎక్కువ మంది రోగులు వస్తుండడంతో వైద్యులు హడావుడిగా చికిత్స చేస్తూ చేతులు దులుపుకొంటున్నా రని రోగులు వాపోతున్నారు. నాడిపట్టి పరీక్షించి రోగితో సమస్య తెలుసుకునే పరిస్థితి లేదని, సాధారణ పరీక్షలు నిర్వహించి తోచిన మందులు ఇచ్చి పంపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వానకాలం పక్కా ప్రణాళిక కొరవడుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగుల తాకిడికి అనుగుణంగా సేవలందిడం లేదు. వాన నీరు సాఫీగా పోయేందుకు చర్యలు తీసుకోవాల్సిన మున్సిపాలిటీ వారు మాత్రం మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. పారిశుధ్యం, దోమల నివారణకు ఏటా సీజన్లో రూ.3 కోట్ల మేర ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో కనీసం ఫాగింగ్ మిషన్లు కూడా ఉపయోగించడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా ఆరోగ్యశాఖ చేపట్టడం లేదు. పట్టణంలో నిత్యం లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, సేకరించడంలో జాప్యంతోనే వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది.
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 3వేల మందికి డెంగీ పరీక్షలు చేయగా 233 మందికిపైగా పాజిటివ్ వచ్చింది. కేవలం ఒక ఆగస్టు నెలలోనే 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 56 వస్తే జనరల్ దవాఖానలో 67 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ సారి డెంగీ కేసులు భారీగా పెరగాయి.
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా రోగుల తాకి డి పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ప్రధానంగా వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువ, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నిల్వ నీటి వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. వైద్యుల సూచన మేరకు మం దులు వేసుకోవాలి.
– డాక్టర్ శ్రావణ్కుమార్, జనరల్ ఫిజిషియన్, మహబూబ్నగర్ జిల్లా