నారాయణపేట, జనవరి 2 : రైతులు తలెత్తుకొని బతకాలని, ఆర్థికంగా బలోపేతం కావాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు సరిహద్దులు దాటింది. నారాయణపేట జిల్లాలోని 19 గ్రామాల్లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన రైతులు వందల ఎకరాలు కొనుగోలు చేశారు. ఎన్నో ఏండ్లుగా పంటలు సాగుచేస్తూ ఇక్కడే విక్రయిస్తున్నారు. కొందరు స్థానికంగా స్థిరపడ్డారు. వారందరికీ సర్కార్ సాయం అందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడితో పాటు విత్తనాలు, ఎరువులను కూడా సబ్సిడీపై ఇస్తున్నది. దీంతో సంబురంగా సాగు చేస్తున్నారు. ఇలాంటి రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదంటూ అభిప్రాయపడుతు న్నారు. తెలంగాణలోని పథకాలు, ప్రోత్సాహకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచేయాలని అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ముక్తకంఠంతో చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం సరిహద్దులను దాటుతున్నది. యావత్ తెలంగాణలో ఉన్న రైతులకే కాకుండా రాష్ట్ర సరిహద్దులో భూములు ఉన్న కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర కర్షకులకు సైతం పంట పెట్టుబడి సాయం అందించి పెద్దమనస్సును చాటుకుంటున్నది. నారాయణపేట జిల్లా తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దుకు ఆనుకొని ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక ప్రాంతానికి చెందిన రైతులతోపాటు ఆంధ్రా, మహారాష్ట్రకు చెందిన రైతుల భూములు సైతం ఉన్నాయి. నారాయణపేట జిల్లాలోని కృష్ణ, మాగనూర్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలు తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల సరిహద్దులో ఉంటాయి. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం చేగుంట, గుడెబల్లూర్, కృష్ణ, కున్ని, అలంపల్లి, తంగిడిగి, కుసుమూర్తి, వాసునగర్, కృష్ణ చెక్పోస్టు, టైరోడ్ గ్రామాలు ఉన్నాయి. మాగనూర్ మండలకేంద్రం, ఊట్కూర్ మండలంలో సంస్థాపూర్, సామనూర్, అమీన్పూర్, కొల్లూర్, నారాయణపేట మండలంలో జలాల్పూర్, భైరంకొండ, ఏక్లాస్పూర్, దామరగిద్ద మండలంలో సజనాపూర్, ఉల్లిగుండం, విఠలాపూర్, కాన్కూర్తి గ్రామాలు ఉన్నాయి.
ఆయా గ్రామా ల్లో కర్ణాటకకు చెందిన రైతుల భూములతోపాటు మహారాష్ట్రలోని ముంబాయి, పుణెకు వలసవెళ్లి అక్కడే స్థిరపడి ఆధార్కార్డు పొందిన రైతుల భూములు కూడా సరిహద్దులో ఉన్నాయి. వీటికితోడు కృష్ణ మండలం టైరోడ్, వాసునగర్, కృష్ణ చెక్పోస్టు వద్ద ఆంధ్రా ప్రాంతానికి చెందిన వందల కుటుంబాలు భూములను కొనుగోలు చేసి పంటలను పండిస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రం శక్తినగర్లోని థర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేసే అనేకమందికి తెలంగాణలో భూములు ఉన్నాయి. వీరికి కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథ కం డబ్బులు అందుతున్నాయి. నారాయణపేట జిల్లాలోని 19 గ్రామాల్లో ఉన్న వందలమంది కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర రైతులకు రైతుబంధు సాయం అందుతున్నది. వీరికి కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర ఆధార్కార్డులు ఉన్నప్పటికీ భూములు తెలంగాణలోనే ఉన్నాయి.
పంటలను సైతం ఇక్కడే విక్రయిస్తుండడంతో రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడికి సాయం అందించడమే కాకుండా అవసరమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నదని కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నదని.. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసి రైతులకు రవాణాభారం పడకుండా చూస్తున్నదని.. ఇలాంటి రైతు ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ లాంటి రైతు పక్షపాతిని తాము ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ అమలవుతున్న పథకాలు, రైతు ప్రోత్సాహకాలను యావత్ దేశంలో అమలు చేయాలని కోరుతున్నారు. ఒకనాడు ఇక్కడి పల్లెల్లోని పంట పొలాలు ఎక్కువశాతం బీడు భూములుగా ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మించడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం ఖాయమని అన్నారు.
కర్ణాటకలోనూ అమలు చేయాలి
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులను ఆదుకుంటుంది. పంట పెట్టుబడి నుంచి తిరిగి రైతు పండించిన పంటలను కొనేవరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ, రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. దీంతో రైతుకు మనోధైర్యం కలుగుతుంది. తాము కర్ణాటక వాసులమే అయినప్పటికీ తమ భూములు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఏడాదిలో రెండుమార్లు తమకు పంట పెట్టుబడి సాయం అందుతుంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మరవలేము.
– రైతు బస్వరాజ్, శక్తినగర్, కర్ణాటక
బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటకలో రావాలి
తెలంగాణలో అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటకలో వస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో అందుతున్న పథకాలు ఏ మాత్రం బాలేవు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి పెద్దఎత్తున నిర్మించింది. దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకుంటున్నది కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పాలి. పంటలను పండించడానికి ఉపయోగించే కరెంట్ను కూడా ఉచితంగా అందించడంతోపాటు విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తుంది. పండిన పంటలను వ్యాపారులు మద్దతు ధరకు కొనకపోతే ప్రభుత్వమే కల్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంది. రైతు చనిపోతే రూ.5లక్షల బీమా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది.
– రైతు పర్వత్రెడ్డి, శక్తినగర్, కర్ణాటక