..వారివి ఆధారం లేని బతుకులు. గత ప్రభుత్వాల వివక్ష, పట్టింపులేమితో దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబాలు.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏండ్లకేండ్లు ఎదురుచూసి అలసిపోయిన జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయి. దళితులను అట్టడుగు నుంచి ఉన్నతస్థితికి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ బతుకుబాట చూపుతున్నది. అందుకు చారకొండ మండలంలోని పలువురి జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది.
1,407 మందికి రూ.10 లక్షల సాయం అందజేయగా.. ఒకప్పుడు దొరికిన పని చేసి.. ఉన్ననాడు తిని లేనినాడు పస్తులున్న ఎందరినో కోళ్లఫాం, కిరాణం, ఆటోలు, కార్లు, సిమెంట్, దుస్తుల దుకాణాలకు యజమానులుగా మార్చింది. నాడు పనికోసం పాకులాడిన వారే నేడు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. నాటి బాధలన్నీ దూరం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు.
కల్వకుర్తి, జూన్ 27 : ప్రభుత్వం దళితుల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో నాలుగు మండలాలను దళితబంధు పథకానికి ఎంపిక చేసింది. అందులో నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఒకటి. కాగా ఈ మండలంలో 1,407 కుటుంబాలను అధికారులు గుర్తించారు. లబ్ధిదారులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి యూనిట్లను పంపిణీ చేయడంతో మండలంలో దళితబంధు సంపూర్ణమైంది.
దళిత కుటుంబాల్లో వెలుగులు
చారకొండ మండలంలోని లబ్ధిదారుల కుటుంబాల్లో దళితబంధు పథకం వెలుగులు నింపింది. ఊరికి దూరంగా ఉన్న దళిత వాడలు ధనిక వాడలయ్యాయి. జీతగాళ్లు, గాసగాళ్లు, డైవర్లుగా చెమటోడ్చిన వారికి ఈ పథకం ఆసరాగా నిలిచింది. రూ.10లక్షలతో లబ్ధిదారులు తమకు అనువైన యూనిట్లను ఎంచుకొని యజమానులుగా మారారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు అంటున్నారు.
1,407మంది లబ్ధిదారులు..
చారకొండ మండలంలో 13 గ్రామ పంచామతీలు ఉండగా.. 1,407మందిని అధికారులు గుర్తించారు. అగ్రహారం తండాలో 22, చారకొండలో 223, మర్రిపల్లిలో 43, రామచంద్రాపురంలో 37, శిరుసనగండ్లలో 133, తిమ్మాయిపల్లిలో 125, తుర్కలపల్లిలో 148, చంద్రాయన్పల్లిలో 110, ఎర్రవల్లిలో 64, గోకారంలో 129, జేపల్లిలో 73, జూపల్లిలో 235, శేరి అప్పారెడ్డిపల్లిలో 65మందిని ఎంపిక చేశారు.
యూనిట్ల పంపిణీ..
లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించిన అనంతరం వారి జీవనోపాధికి అవసరమైన యూనిట్లను అధికారులు అందజేశారు. జూపల్లి, చారకొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, గువ్వల బాలరాజు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. దీంతో చారకొండ మండలంలో దళితబంధు నూటికి నూరు శాతం సంపూర్ణమైంది.
దళితుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
దళితబంధు పైలట్ ప్రాజెక్ట్కు చారకొండ మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు దళిత సోదరుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మండలంలో గుర్తించిన 1,407మందికి పూర్తిస్థాయిలో యూనిట్లను అధికారుల సహకారంతో గ్రౌండింగ్ చేశాం. యూనిట్లు పొందిన వారంతా ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న యుగపురుషుడు. ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నా. దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలి.
– గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అచ్చంపేట.
ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నా..
దళితబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులతో ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాన్ని పెట్టుకున్నా. మా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఫర్టిలైజర్ దుకాణాన్ని నిర్వహించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలోని రైతులు నా దుకాణం వద్దకే వస్తున్నారు. మాలాంటి పేద కుటుంబాలకు దళితబంధుతో చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఎప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా..
డెయిరీ ఫాం నడుపుతున్న..
నా భార్య పేరు పద్మ. ఆమె పేరు మీదనే దళితబంధు యూనిట్ మంజూరైంది. మాకు మూడున్నరెకరాల పొలం ఉండటంతో డెయిరీని యూనిట్గా తీసుకున్నాం. మా పొలం వద్ద డెయిరీకి సంబంధించిన షెడ్డును నిర్మించుకున్నాం. అధికారులు ఆరు గేదెలను ఇవ్వగా.. ప్రస్తుతం రోజుకు 15 లీటర్ల పాలు విక్రయిస్తున్నాం. ఎకరా పొలంలో పచ్చిగడ్డి వేసుకున్నాం. దళితబంధు రాకముందు వ్యవసాయ పనులు లేకపోతే కూలీ పనులకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు మా పని మాకు సరిపోతుంది. ప్రతి రోజూ పొలం వద్దకు వెళ్లి బర్రెలకు గడ్డి వేయడం, పాలు పితకడంతోపాటు పొలం పనులతో బిజీగా ఉంటున్నాం. ఈ పథకాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి మాలాంటి దళిత కుటుంబాల తరఫున రుణపడి ఉంటా.
– రాంపురం శేఖర్, రైతు, జూపల్లి.
డ్రైవర్ నుంచి యజమానిగా..
మా అమ్మ (అంజమ్మ) దళితబంధుకు ఎంపికైంది. ఈ పథకం ద్వారా ట్రాక్టర్ తీసుకున్నాం. మాకు ఎకరా పొలం ఉంది. మేము ఇద్దరం అన్నదమ్ములం కాగా తమ్ముడు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నడు. నేను ఊళ్లోనే ఉంటూ ట్రాక్టర్ డైవర్గా పనిచేసేవాణ్ణి. దళితబంధు ద్వారా వచ్చిన డబ్బుతో ట్రాక్టర్ తీసుకున్నాం. మా పొలంలో పనులతోపాటు కిరాయికి కూడా తిప్పుతున్న. డ్రైవర్ కంటే ఇప్పుడు యజమానిగా నాపై మరింత బాధ్యత పెరిగింది. ట్రాలీ పనికి పోతే రోజుకు రూ.1,200 నుంచి రూ.1,500 మిగులుతాయి. దున్నడానికి పోతే గంటకు రూ.వెయ్యి వస్తాయి. ట్రాక్టర్ రావడంతో బతుకుదెరువుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రాక్టర్ ద్వారా వచ్చిన డబ్బును మా పిల్లల చదువుకు ఉపయోగిస్తాం.
దళితబంధుతో మా కుటుంబానికి చాలా మేలు జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు శతకోటి వందనాలు.
– ఏ పరశురాములు, లబ్ధిదారురాలి కొడుకు, జూపల్లి.
సూపర్ మార్కెట్ పెట్టుకున్న..
దళితబంధు ద్వారా వచ్చిన డబ్బులతో మా ఊళ్లోనే సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకున్న. ఈ పథకం మా కుటుంబానికి ఆదెరువుగా నిలిచింది. ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసుకోగా బాగానే నడుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. దళితుల కుటుంబాల్లో ఈ పథకం ద్వారా వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రుణపడి ఉంటాం.
– గోరెటి అఖిలేశ్, చారకొండ.
తెలంగాణ వచ్చినంక మంచిగైంది..
తెలంగాణ రాకముందు ఎరువుల కోసం కొట్టుకునేంత పని అయితుండె. తాడూరులో ఎరువులు దొరక్కపోతే కందనూలుకు పోయి రాత్రి అక్కడే కావలి ఉండేవాళ్లం. ఇప్పుడు అన్ని చోట్ల.. ఎప్పుడైనా ఎరువులు దొర్కుతున్నయ్. ఇంతకుముందు ఎరువులు లేక పంటలు పాడైతుండె. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ఎరువుల సమస్య తీరింది.
– మల్లయ్య, రైతు, యంగంపల్లి