పాలమూరు/అలంపూర్ చౌరస్తా/అయిజ/కొల్లాపూర్ ఫిబ్రవరి 24 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు చోట్లా కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లింది. ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి, ప్రాగటూర్, మరమునగల, శేరుపల్లి, బొంకూరు, పుల్లూరు, కలుగోట్ల, మెన్నిపాడు తదితర గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన పొగాకు, మిర్చి తడిసిపోయాయి. అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షం దంచికొట్టడంతో పలు వీధుల్లో డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.
గట్టు మండలంలో పొలాల్లో ఆరబెట్టిన పొగాకు అంకణాలు వర్షంకు తడిసి ముద్దయ్యా యి. మొక్కజొన్న పైర్లు కిందకు వాలి పడిపోయాయి. కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోనూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు వర్షం కురవడంతో కుడికిళ్ల, నార్లాపూర్, ఎల్లూరు, పెద్దకొత్తపల్లి మండ ల పరిధిలోని కల్వకోలు, తిర్నాంపల్లి గ్రామాలలో మామిడి కాయలు రాలిపోయినట్లు మామిడి రైతులు వాపోయారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా కేంద్రాల్లో అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో ఉన్న వేరుశనగ తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.