మహబూబ్నగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుతోపాటు మిగితా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు తగ్గిపోవడంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం కాల్వలకు మరమ్మతులు చేస్తుండడంతో స్వల్పంగా వరద పీజేపీకి విడుదలవుతున్నది. అయినా ఆయకట్టుకు విడుదల చేసే మార్గం కనిపించడం లేదు. గతేడాది జూరాల కింద 14,534 ఎకరాలకు సాగునీరు అందింది. కాగా సంగంబండ రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉండడంతో పంటలకు విడుదల చేస్తున్నారు. అలాగే కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా నీటి విడుదల జరుగుతుందా..? లేదా అన్న గుబులు కర్షకుల్లో మొదలైంది. మక్తల్, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మధుసూదన్రెడ్డి, పర్ణిక రెండ్రోజుల కిందట హైదరాబాద్లో ఇరిగేషన్ అధికారులను కలిశారు. సాగర్ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని కోరినా.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతా ప్రభుత్వం చేతిలో ఉన్నదని చెప్పడంతో వారి విజ్ఞప్తికి ఫలితం శూన్యంగా మారింది. పంటలకు నీళ్లొస్తాయన్న ఆశతో కొందరు రైతులు సాగు పనులు షురూ చేశారు. ఏదిఏమైనా నీరు విడుదల చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి పంటలపై అనిశ్చితి నెలకొన్నది. ఈసారి వానకాలం సీజన్లో వర్షాభావం వెంటాడినప్పటికీ సరైన సమయానికి అప్పుడప్పుడు కురిసి వానలు రైతన్నను గట్టెక్కించాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు జలకళ సంచరించుకున్నది. కుడి, ఎడమ కాల్వలతోపాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు సరైన సమయంలో నీటిని విడుదల చేసి కేసీఆర్ ప్రభుత్వం కర్షకులను ఆదుకున్నది. మరోవైపు వర్షాలకు వాగులు పొంగి పొర్లడంతో ఉమ్మడి జిల్లాలో చెక్ డ్యాములు జలకళ సంతరించుకున్నాయి.
వరుణుడి జాడేది..?
వర్షాకాలం దాటిపోయినప్పటికీ ఇప్పటి వరకు మళ్లీ వరుణుడి జాడ కనిపించలేదు. తుఫాన్లు వచ్చినా వాటి ప్రభావం పెద్దగా లేదు. దీంతో యాసంగి పంటలకు సాగునీరు లభించని పరిస్థితి దాపురించింది. తీవ్ర వర్షాభావాలతో ఇటు జూరాల ప్రాజెక్టులో.. అటు మిగతా ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు ఈ ఏడాది యాసంగి సీజన్కు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. భీమా ప్రాజెక్టు కింద సంగంబండ రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా ఉండటంతో అధికారులు రైతుల కోరిక మేరకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. కోయిల్సాగర్లో కూడా పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల సూచన మేరకు క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు. జూరాల ప్రాజెక్టులో ఆశించినంత మేర నీటి నిల్వలు లేకపోవడంతో ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే అధికారుల సూచనలను పట్టించుకోకుండా రైతన్నలు యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు. జూరాల, కోయిల్సాగర్, ఎంజీకేఎల్ఐ కింద అన్నదాతలు పెద్ద ఎత్తున వరి ఇతర పంటల సాగు చేపట్టారు. అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు.
ఎమ్మెల్యేలు కోరినా విడుదలకాని నీరు
ఈ నెలలో ప్రభుత్వం మారిపోవడంతో కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద నీటి విడుదల జరుగుతుందా..? జరగదా..? అనేది సందిగ్ధంగా మారింది. మరోవైపు రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి రెండు రోజుల కిందట ఇరిగేషన్ అధికారులను హైదరాబాద్లో కలిశారు. యాసంగికి కోయిల్సాగర్ కింద ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా కోయిల్సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తామేమి నిర్ణయం తీసుకోలేమని, అంతా ప్రభుత్వం చేతిలో ఉన్నదని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
దీంతో ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ఫలితం శూన్యంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ వారి ప్రయోజనాలు కాపాడేందుకు ముందుండే ప్రయత్నం జరిగింది. కానీ ఈసారి ప్రభుత్వం మారడంతో విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకు యాసంగి పంటలకు నీరు వదులుతారా? లేదా? అనేది ఇంకా తేల్చలేకపోతున్నారు. కానీ రైతులు మాత్రం పెద్ద ఎత్తున సాగు చేసుకుంటుండడంతో పంటలను కాపాడుతారా? క్రాప్ హాలిడే ప్రకటించి చేతులు దులుపుకుంటారని తేలాల్సి ఉన్నది. కోయిల్సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టుల కింద రైతులు అయోమయంలో పడ్డారు.
క్రాప్ కోయిల్సాగర్ కింద 9 వేల ఎకరాలు
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లో వానకాలం సీజన్ ముగిసినా నిండుకుండలా కనిపిస్తుంది. వర్షాలకుతోడు.. జూరాల బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టుకు నీటిని తరలించారు. దీంతో రిజర్వాయర్లో నీటిమట్టం అంతకంతకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 32 అడుగులకుగానూ 31 అడుగుల నీరు నిల్వ ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కింద ఉన్న పెద్దవాగుపై ఉన్న చెక్ డ్యాములన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతాంగం ఇటు వాగు పరివాహక ప్రాంతాలు, కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద సుమారు 9,000 ఎకరాల్లో సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. అధికారులు వద్దంటున్నప్పటికీ రైతులంతా నారుమడులు వేసుకోవడానికి పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నారు. మడులు సిద్ధం చేసి వారంలో నారు పోసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు వదులుతారా? లేదా..? అనేది ఉత్కంఠంగా మారింది. రైతులంతా యాసంగి పంటకు సిద్ధమవుతుండడంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కేవలం సాగునీటి ఉద్దేశించిందని రైతులకే నీరు వాడుకునే హక్కు ఉన్నదని చెబుతున్నారు. ఒకవైపు అధికారులు వద్దంటున్నా రైతులు సాగు చేస్తుండడంతో యాసంగి పంటల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన నెలకొన్నది.
క్రాప్ హాలిడేకే కట్టుబడి ఉంటారా..?
యాసంగి పంటలకు నీళ్లు వదులుతారా..? అనే డైలామా కొనసాగుతున్నది. నారాయణపూర్ జలాశయం కింద కాల్వలకు మరమ్మతు పనులు జరుగుతుండడంతో కొంత నీటిని డ్యాం అధికారులు దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ఫ్లో నమోదవుతున్నది. వచ్చిన వరదను వచ్చినట్లే నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు 1500 క్యూసెక్కులను వదులుతున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల జూరాల డెడ్ స్టోరేజ్కి చేరుకోవడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరు విడుదల చేయడం అసాధ్యమని, క్రాప్ హాలిడేకి రైతులు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు.
సాగర్ నీరు విడుదల చేయకుంటే ఆందోళన
కోయిల్సాగర్ ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటిమట్టం ఉన్నదని, ఈ జలాలతో రైతులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. గతంలో కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదని, రైతులు అడిగిన తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసేదని గుర్తు చేశారు. నీటిమట్టం తగ్గినప్పటికీ ఎన్నడూ తొమ్మిదిన్నర ఏళ్లలో క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. పుష్కలంగా నీరు పెట్టుకొని కూడా క్రాప్ హాలిడే ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాలకు నీరు వాడుకునేది. మిషన్ భగీరథ పథకం వచ్చాక నేరుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను తరలించడంతో కోయిల్సాగర్ నీటిని సాగునీటికే వినియోగించే వారన్నారు. అదే ఆశతో యాసంగి పంటలకు సిద్ధమవుతున్నామని, సాగునీరు విడుదల చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు.
నీటి విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత..
జూరాల డ్యాంలో తగినంత నీటి సామర్థ్యం లేకపోవడంతోపాటు నారాయణపూర్ డ్యాం కింద క్రాఫ్ హాలిడే ప్రకటించడంతో అక్కడి నుంచి వచ్చే రీజనరేటర్ వాటర్ నిలిచిపోవడంతో మనకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది యాసంగిలో జూరాల కింద క్రాఫ్ హలిడే ప్రకటించే అవకాశముంది. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– జుబేర్ అహ్మద్, జూరాల ప్రాజెక్టు ఈఈ