గద్వాలలో జోరుగా ఐపీఎల్ పందెం
యువతే లక్ష్యం.. బుకీలకు కాసుల వర్షం
వెయ్యికి రూ.100 కమీషన్తో ఆశ
అప్పుల్లో కూరుకుపోతున్న యువత
కొరవడిన పోలీసుల నిఘా
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కాసులు కురిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో బెట్టింగ్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా సాగుతున్నది. ఫోర్, సిక్స్కో రేటు.. రన్.. రన్కు మరో రేటు.. ఔట్కు.. క్యాచ్కు ఇంకో రేట్ ఇలా.. బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తున్నది. యువతే లక్ష్యంగా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. బెట్టింగ్ బాబులు మ్యాచ్ను నడిపిస్తూ 10 పర్సెంట్ కమీషన్ రూపంలో రోజుకూ వేలల్లో సంపాదిస్తున్నారు. బెట్టింగ్ వ్యసనంతో యువత జేబులు గుల్లచేసుకుంటున్నారు. అయినా పోలీసుల నిఘా కొరవడిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గద్వాల న్యూటౌన్, మే 9 : బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. యువతను లక్ష్యంగా చేసుకొని బెట్టింగ్ నడిపిస్తున్నారు. 10 పర్సెంట్ కమీషన్ రూపంలో రోజుకు వేలల్లో సంపాదిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా సాగుతున్నది. యువత పందేలు కా స్తూ ఆర్థికంగా నష్టపోతుండగా.. బుకీలు మాత్రం లక్షల్లో ఆర్జిస్తున్నారు. గతంలో పోలీసులకు పట్టుబడిన వారే మళ్లీ బెట్టింగ్ నిర్వహిస్తుండడంతో పోలీసుల నిఘా వైఫల్యమా..? లేక బుకీలు ఇచ్చే మా మూళ్లకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యువతే లక్ష్యంగా..
క్రికెట్ అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు చూసేందుకు ఎగబడతారు. అందులోనూ ఐపీఎల్ మ్యాచ్లంటే మరింత క్రేజ్. కాగా, టీంలోని క్రీడాకారుల ఆధారంగా పెద్ద జట్టు, చిన్న జట్టు అని రెండు విధాలుగా విభజించి పందేలు కా స్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కొందరు బుకీలుగా ఉంటూ.. యువత లక్ష్యంగా బెట్టింగ్ దం దా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇరువర్గాలకు మధ్యవర్తులుగా ఉంటూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. వీరికి ప్రొద్దుటూరు, హైదరాబాద్, డోన్ తదితర జిల్లాల్లోని బెట్టింగ్ నిర్వాహకులతో సంబంధాలున్న ట్లు తెలుస్తున్నది. బుకీలు ఇంటి వద్దే ఉంటూ వారికి పరిచయుమున్న వ్యక్తులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మ్యాచుకు గంట ముందే.. ఏ టీం ఎంత రేటింగ్లో ఉందని ప్రకటిస్తున్నట్లు సమాచారం. టా స్ వేసినప్పటి నుంచి బెట్టింగ్ ప్రారంభిస్తున్నారు. బుకీలు గెలిచిన వ్యక్తికి 10 శాతం కమీషన్ పట్టుకొని మిగతా మొత్తాన్ని ముట్టజెబుతున్నారు. ఇలా ప్రతి రోజూ సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా, గతంలో పోలీసులకు పట్టుబడిన అయిజకు చెందిన ప్రధాన వ్యక్తి బెట్టింగ్లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. అతని కింద అయిజలో సుమారు 300 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గ ద్వాల పట్టణంలోని షేరెల్లి వీధికి చెందిన ఓ యువకుడు, గద్వాల మండలం పూడురు గ్రామానికి చెం దిన మరో వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఆన్లైన్లో జోరుగా..
ఆన్లైన్ యాప్ల్లో సైతం యువకులు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. యాప్లో ప్రత్యేకంగా ఐడీని క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి టీంలోని ఆటగాళ్లను బట్టి యాప్ నిర్వాహకులు పాయింట్లను ప్రకటిస్తారు. టీం పాయింట్లను బట్టి కొంత మంది యువకులు పందేలు కాస్తున్నారు. యువత తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి మరీ పందెం కాస్తున్నారు. మొదట్లో కొంచెం లాభం రాగానే వడ్డీ ఎంతైనా అప్పు చేస్తున్నారు. తీరా డబ్బులు పోగొట్టుకున్నాక అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఓ యువకుడు అప్పులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడగా.. మరో యువకుడు దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలుస్తున్నది. జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో బెట్టింగ్ జరుగుతుందో, బుకీలు ఎవరో తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. బుకీలు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టజెపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.