గద్వాల రూరల్, ఫిబ్రవరి 25 : దేశంలో బీజేపీ ఆగడాలు మితిమీరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతున్నదన్నారు. దీంతో జీడీపీ రేటు పడిపోతున్నదని, నిత్యావసర సరుకులు, ముడిచమురు ధరలు పెరుగుతున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. బీజేపీని గద్దె దించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. బీజేపీని తెలంగాణలో విస్తరించాలని అక్రమమార్గంలో పయనిస్తున్నదని, ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీ, సీబీఐ సంస్థలతో దాడులు చేయించి బెదిరింపు చర్యలకు పూనుకుంటుందన్నారు.
ఆలయాలు, ప్రగతి భవన్ కూలుస్తామని మాట్లాడుతూ ప్రజల మధ్య అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. బీజేపీ సర్కార్ ఉపాధి హామీ పథకానికి గతంలో రూ.68 వేల కోట్లు కేటాయించి.., నేడు రూ.60వేల కోట్లకు కుదించిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాల్సింది పోయి కుదించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సీఎం కేసీఆర్ పోరాటం సాగిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామన్నారు. అంతకుముందు సీపీఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంవీ రమణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటస్వామి, నాయకులు నరసింహులు, నర్మద, దేవదాసు, మారెన్న పాల్గొన్నారు.