జడ్చర్ల టౌన్/బాలానగర్, ఫిబ్రవరి 29 : దేశవ్యాప్తంగా 12కోట్ల గృహాలకు పీఎన్జీఆర్బీ వంట గ్యా స్ కనెక్షన్లు అందించనున్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు అంజనీకుమార్ వెల్లడించారు. బాలానగర్ మండలంలోని బోడజనంపేటలో గృహ అవసరాలకు అనుగుణం గా మేఘా గ్యాస్ సరఫరా చేస్తున్న మొదటి పైప్డ్ నే చురల్ గ్యాస్ సీఎన్జీ స్టేషన్ను గురువారం జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ సమీపంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పీఎన్జీఆర్బి చే స్తున్న పీఎన్జీ డ్రైవ్లో భాగంగా గృహ, పారిశ్రామిక అవసరాలకు మేఘా గ్యాస్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ప్రారంభించామన్నారు. దేశంలోని సీజీడీ రంగంలో కీలకమైన 10 రాష్ర్టాల్లో 22 జియోగ్రాఫికల్ ఏరియాల్లో నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తూ మేఘా గ్యాస్ అగ్రగామిగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 12కోట్ల గృహాలకు పీఎన్జీ కనెక్షన్లు అందించాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేఘా గ్యాస్ సంస్థ 1.3కోట్ల కనెక్షన్లు అం దించనున్నట్లు తెలిపారు.
17వేలకు పైగా సీఎన్జీ స్టే షన్లను ఏర్పాటు చేయనుండగా, 2200కు పైగా కనెక్షన్లు మేఘా సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు దృష్టిపెట్టామన్నారు. ఇందులో భాగంగా శరవేగంగా 120 కి.మీ.పైగా పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన మేఘా గ్యాస్ సంస్థను అభినందించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు 35 వేల కి.మి. పైప్లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మేఘా గ్యాస్ సంస్థ డైరక్టర్ సీఈవో పి. వెంకటేశ్ మాట్లాడుతూ మహబూబ్నగర్ జియోగ్రాఫికల్ ఏ రియాలో కాలుష్యరహిత గ్రీన్ ఇంధనాన్ని సరఫరా చేసేందుకు అన్నివిధాలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నేచురల్ గ్యాస్ సేవలు విస్తరించడంలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో మొదటి ఎల్సీఎన్జీ ప్లాంట్ ప్రారంభించినట్లు తెలిపారు. పంజాబ్, తమిళనాడు రాష్ర్టాల్లోనూ ఎల్సీఎన్జీ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేఘా గ్యాస్ ఛీప్ జనరల్ మేనేజర్ తిమ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.