జిల్లావ్యాప్తంగా మోస్తరు వాన
చెరువులు, కుంటల్లోకి చేరిన వరద
మెట్టపంటలకు ఊరట
జడ్చర్ల/జడ్చర్లటౌన్/కోయిలకొండ/మూసాపేట, జూలై 8 : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు చేరుతున్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్టపంటలకు ఊరటనిస్తుండగా, వరిసాగు చేసే రైతులు నారుమడ్ల ను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా జడ్చర్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోత ట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మురుగుకాల్వలు నిండి రోడ్లపైకి నీరు చేరుతుండడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.
లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కోయిలకొండ మండలంలో 6.5 సెం.మీ. వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి కోయిలకొండ బస్టాండ్ సమీపంలోని ఇండ్లల్లోకి నీరు చేరింది. మోదీపూర్ పెద్దవాగులో రూ.7కోట్లతో నిర్మించిన కత్వా పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. కత్వా అలుగు పారడంపై సర్పంచ్ స్వప్నారవి సంతోషం వ్యక్తం చేశారు. మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లిలో కురిసిన వర్షానికి నీరు రోడ్డుపై నిలిచింది. మాజీ ఎంపీపీ కమలమ్మ ఇంటికి వెళ్లే దారిలో నీరు నిల్వడంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరద వెళ్లేందుకు ఉన్న కాల్వను కొందరు పూడ్చివేయడంతో సమస్య ఏర్పడిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు దిగువకు వెళ్లేలా కాల్వను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు.