నాగర్కర్నూల్, మే 20 (నమస్తే తెలంగాణ) : పల్లెలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. పల్లెల్లో బుధవారం షురూ కాగా.. 23 వరకు, బల్దియాల్లో 19న ప్రారంభమై.. 27వ తేదీ వరకు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మురుగు కాల్వల్లోని చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసి.. పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. తాగునీరు కలుషితం కాకుండా పరిశుభ్రంగా మార్చనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. గడువులోగా పరిసరాలను పరిశుభ్రంగా మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సర్పంచులు, కార్యదర్శులు స్థానికంగా ఉంటూ పనులు చేయిస్తుండగా.. అదనపు కలెక్టర్లు, డీపీవోలు పర్యవేక్షిస్తున్నారు.
పల్లెల్లో పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముందస్తు చర్యల కోసం పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 23వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నది. ఫలితంగా గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు.
గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముం దస్తుగా ప్రభుత్వం అప్రమత్తత చర్యలు చేపట్టనున్న ది. ఎండాకాలం మధ్యలో కురిసిన అకాల వర్షాలు వానకాలాన్ని తలపించాయి. కాగా, వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తున్నది. అదేవిధంగా కార్యదర్శులు పది రోజులకుపైగా సమ్మెలో ఉన్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య లోపం ఏర్పడింది. చెత్త, మురుగు పేరుకుపోతే దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి కార్యదర్శుల సమ్మెను విరమింపజేయడంతో తిరిగి విధుల్లోకి చేరారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పారిశుధ్య చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు పారిశుధ్య నిర్వహణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతోపాటు మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లనున్నారు. అలాగే ఇండ్లు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, బస్స్టాప్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ రోడ్ల వెంట పెరుగుతున్న పిచ్చి మొక్కలను తొలగించనున్నారు. తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను శుభ్రం చేయనున్నారు.
ప్రజలకు అవగాహన..
పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇండ్లల్లో నీరు, చెత్త ఉండకుండా చూసుకోవాలని కార్యదర్శులు ప్రజలకు వివరిస్తున్నారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలు పారిశుధ్య పనులను పర్యవేక్షించనున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు సిబ్బందికి స్థానిక సర్పంచ్, పాలక మండలి సభ్యులు సహకరించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ ఆదేశంతో వారం రోజుల స్పెషల్ డ్రైవ్తో గ్రామాల్లో పారిశుధ్యం తిరిగి గాడిన పడనున్నది.
స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం..
ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 23వరకు వారం రోజులు పారిశుధ్య నిర్వహణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని 461గ్రామ పంచాయతీల్లో మురుగు కాల్వలు శుభ్రపర్చడం, పిచ్చిమొక్కలు తొలగించడం, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలు తీసుకుంటాం. కార్యదర్శులు స్థానికంగానే ఉండి పనులను చేపట్టేందుకు ఆదేశించాం. వర్షాలకు సైతం ప్రజలు ఇబ్బందులు గురికాకుండా ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నాం.
– కృష్ణ, డీపీవో, నాగర్ కర్నూల్