గద్వాల, మే 19 : ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మి ంచి ఇచ్చి పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసిం ది. అధికారులు , కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అవి నేటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వారి తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. వీరి నిర్లక్ష్యం కారణంగా ఇండ్ల నిర్మాణాలు పూ ర్తయినా పేదవాడి సొంతింటి కల మాత్రం నెరవేర డం లేదు.
2023 ఏప్రిల్లో ఇండ్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇండ్ల్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అప్పటి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించగా అర్హులైన వారు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నిజంగా ఇళ్లు ఉందా లేదా అనే విషయాన్ని వార్డుల వారీగా అధికారులను నియమించి పూర్తిస్థాయి విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను కలెక్టర్కు అందజేశారు. అనంతరం అర్హులను ఎంపిక చేయడంలో భాగంగా డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసి నేటికి రేండేళ్లు దాటినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరగకపోవడంతో వారు సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్నారు.
నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో నేటికి ఇండ్లు ఖాళీగానే ఉండిపోయాయి. ప్రస్తుత కలెక్టర్ వేగవంతంగా మౌలిక వసతులు కల్పించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించినా నేటికి డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో వాటిని లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో దాదాపు 98మంది పేర్లు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఎంపిక జాబితాను రాజకీయ పలుకుబడితో మార్పు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో ఎంపికైన లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొన్నది.
డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాల్లోకి వెళితే..
గద్వాల పట్టణ సమీపంలో పరుమాల శివారులో గత తెలంగాణ ప్రభుత్వంలో 41ఎకరాల్లో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇండ్ల నిర్మాణం జీ ప్లస్గా నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24 ఇండ్లు నిర్మించారు.1,275 డబుల్ ఇండ్లకు అధికారులు దరఖాస్తులు 2023 ఏప్రిల్ ఆహ్వానించారు. 1,275ఇండ్లకుగానూ 5,155మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తు చే సుకున్న లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ చేయగా అందులో 3,171మంది అర్హులుగా గుర్తించారు.
అయితే ఇందులో గతంలో పట్టా లు పొందిన వారు ఉండగా వారు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లిన 504మంది లబ్ధిదారులకు సంబంధించి ఇండ్లను డిప్లో వేయకుండా 771ఇండ్లకు డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన సమయంలో డిప్లో ఇల్లు పొందిన వారికి ప్రొసీడింగ్ ఇవ్వలేదు. దీంతో డిప్లో ఇండ్లు పొందిన వారు తమ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారు. ఇండ్లకు డిప్ వేసిన సమయంలో ఇండ్లకు కొన్ని మౌలిక వసతులు కల్పించే విషయం లో వారికి కేటాయించలేదు. అవి కల్పించిన తర్వాత అందరిని ఒకేసారి గృహ ప్రవేశం చేయిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డిప్లో డబుల్బెడ్రూం ఇల్లు పొందిన వారి సొంతింటి కలపై ఎన్నికల కోడ్ నీళ్లు చల్లినట్లు అయింది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు డబుల్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు కేటాయింపులో జాప్యం జరుగుతుంది. దీంతో లబ్ధిదారులు భయాందోళనకు గురి అవుతున్నారు. తమకు డిప్లో తగిలిన ప్రస్తుతం గద్వాలలో మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ఇళ్లు వస్తుందో రాదో ఆనే ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు.
డిప్ తీసి 2025 ఏప్రిల్తో రెండేళ్లు పూర్తయ్యాయి. అయినా లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండంతో వారి తీరుపై ఇండ్ల్లు లేని నిరుపేదలు గుర్రుగా ఉన్నారు. త్వరగా డబుల్ బెడ్రూం ఇండ్ల్లకు సంబంధించి మౌలిక వసతులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించడం, స్వయంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలించి పనులు వేగవంతం గా చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినా ఆ దిశగా పనులు సాగడం లేదు. దీంతో డబుల్ ఇండ్లపై లబ్ధిదారులు ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొన్నది. దీంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు,ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఇటు డబుల్ బెడ్రూం ఇండ్లు రాక, అటు ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చే డబ్బు లు సరిపోక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కలుగజేసుకొని మౌలిక వసతుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. వెంటనే మిగిలిపోయిన పనులు పూర్తి చేసే విధంగా కలెక్టర్, ఎమ్మెల్యే చొరవ చూపి లబ్ధిదారులకు ఇండ్లు అందజేయాలని ఇండ్లు లేని నిరుపేదలు కోరుతున్నారు.
ఇండ్ల్లకు రక్షణ కరువు..
గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల్ల నిర్మాణం పూర్తై రెండేండ్లు కావస్తున్నా అవి లబ్ధిదారులకు కేటాయించక పోవడంతో వాటికి రక్షణ లేకుండా పోయింది. లబ్ధిదారులుకు కేటాయించక పోవడంతో వాటికి ఏర్పాటు చేసిన గ్లాస్ కిటికీలు, అద్దాలు పగిలిపోతున్నాయి. పర్యవేక్షణలేకపోవడం మందుబాబులకు అడ్డాగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. అవి లబ్ధిదారులకు కేటాయించే వరకు అధికారులు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.