జడ్చర్లటౌన్, సెప్టెంబర్11: ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజకవర్గ స్థాయి గిరిజన సదస్సు నిర్వహించారు. సదస్సుకు మంత్రి సత్యవతి రాథోడ్తోపాటు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..
70ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన ప్రభుత్వాలు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని, సీఎంగా కేసీఆర్ అయ్యాక కేవలం 9ఏండ్లలోనే సమాజంలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేయూతనిచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,146 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి రూ.600కోట్లతో సొంత భవనాలను నిర్మిస్తున్నారన్నారు. విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు 6శాతం నుంచి 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. గిరిజనుల డిక్లరేషన్ కేవలం తెలంగాణకేనా లేక దేశవ్యాప్తమా అనే విషయాన్ని ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు ఖర్గే, రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తం కోసమైతే కర్ణాటక, చత్తీస్ఘడ్లో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధిని తొక్కిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీ గిరిజనుల జిల్లాల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. గిరిజనుల రిజర్వేషన్లు, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అంశాలను తొక్కిపెట్టడంతోపాటు సమ్మక్కసారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం, జీవో 3ను కొట్టేసిన బీజేపీకి గిరిజనుల ఓట్లు అడిగే నైతికహక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం, గిరిజనులు, దళితులు వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలు గిరిజన ద్రోహులని చెప్పారు. ఈ రెండు పార్టీలను దోషులుగా నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి పేదల అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.
అంతకుముందు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. ఎన్నికలప్పుడే కాంగ్రెసోళ్లకు ప్రజలు గుర్తుకొస్తారని.. ఎన్నికలయ్యాక పత్తాలేకుండాపోతారని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మాయమాటలతో మోసం చేసేందుకు వచ్చే కాంగ్రెస్, బీజేపీలపై గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల16న సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ప్రారంభించనున్నారని చెప్పారు. ‘పాలమూరు’ నీటితో జిల్లా పచ్చబడనుందన్నారు. బతుకుదెరువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో నీళ్లు, కరెంట్, సంక్షేమ పథకాలు అమలుకాక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణలోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తండాలు బ్రహ్మండంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గిరిజనుల భవిష్యత్ బాగుపడాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని సూచించారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లను అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నదని గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. జడ్చర్ల మండలం మాచారంలో సోమవారం జరిగిన గిరిజన సదస్సుకు హాజరైన మంత్రి సత్యవతిరాథోడ్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూనియన్లు పనిగట్టుకొని అంగన్వాడీ టీచర్లను సమ్మెబాటను పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటున్నదని, అంగన్వాడీ టీచర్లు సమ్మెను విరమించుకోవాలని మంత్రి సూచించారు.
బాలానగర్, సెప్టెంబర్ 11: సీఎం కేసీఆర్ పాలనలో గిరిజన తండాలకు మంచిరోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో సేవాలాల్ చౌరస్తాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను సోమవారం మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రూ.2కోట్లతో గిరిజన భవనం, మండలంలోని నామ్యాతండా బీటీ రోడ్డుకు రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన శిలఫలాకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. అంతకుముందు సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, జీసీసీ చైర్మన్తో కలిసి పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 16న నార్లాపూర్కు ప్రతిగ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు స్వచ్ఛదంగా తరలిరావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, ట్రైకార్ చైర్మన్ రాంచంద్రనాయక్, జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, జెడ్పీటీసీలు మోహన్నాయక్, రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ రజినీ, ఎంపీపీ కమల, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, యూత్ వింగ్ మండలాధ్యక్షుడు ప్రకాశ్, బీసీసెల్ మండలాధ్యక్షుడు బాలయ్య, ఎస్టీసెల్ మండలాధ్యక్షుడు బాసునాయక్, వర్కింగ్ మండలాధ్యక్షుడు బాలునాయక్, అధికార ప్రతినిధి అరుణ్కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిదులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.