కొత్తకోట, మే 9 : ప్రభుత్వం మెడలు వంచి రైతు పండించిన ప్రతిగింజనూ కొనేలా ఉద్యమిస్తామని, రైతులు అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోట మండలకేంద్రం శివాజీ విగ్రహం వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభు త్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తదని దానిని ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే ఆల మండిపడ్డారు.
ఆలస్యం చేస్తే రైతులు ప్రైవేట్లో అమ్ముకొంటారని, అప్పుడు బోనస్ నుంచి తప్పించుకోవచ్చని రేవంత్రెడ్డి ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు లేవని, లారీలు రావటం లేదని, హమాలీల కొరత ఉందని ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు నట్టేటా ముం చుతున్నారని విమర్శించారు. లారీ, డీసీఎం డ్రైవర్కు రూ.వెయ్యి ఇస్తే తప్పా డీసీఎం పెట్టడం లేదని రైతులు చెబుతున్నారని రైతుల వద్ద ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై కక్ష ఉందని, సాయం చేసే ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధును మూడుసార్లు ఎగ్గొట్టారని, యూరియా సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతు రుణమాఫీ చేయలేదన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్నా గోదాంలను 38లక్షల మెట్రిక్ టన్నుల అయ్యేలా కొత్త గోదాంలు నిర్మించి రైతులను ముందు చూపుతో ఆదుకున్నారని గుర్తు చేశారు. కొత్తకోటలో తాను ధర్నాకు దిగుతుంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొన్న అధికారులు గన్నీ బ్యాగులు, డీసీఎంలను ఏర్పాటు చేసి ఆఘమేఘాల మీద కొనుగోలు కేంద్రాల వద్ద హడావుడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదకన రైతులు పండించిన ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేకపోతే ఆందోళన చేపట్టి రైతులకు అండగా నిలిచి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి , సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నగేశ్, గాడిల ప్రశాంత్, అద్వాని శ్రీనివాసులు, శ్రీనూజీ, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యన్న, ఎరుకలి తిరుపతయ్య, మంజుల రామకృష్ణ, రైతులు మొద్దు బాబు, జలేందర్ రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, కొట్టాల దామోదర్రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణు లు పాల్గొన్నారు.