వనపర్తిలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి.. సిగ్మెంట్ నుంచి 16 మార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు హస్తం పార్టీ, నాలుగు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గెలుపుతో అభివృద్ధికి బాటలు వేశారు. గత పాలనలో నియోజకవర్గంలో మరుగున పడిన ప్రగతి పరుగులు పెట్టింది.. ఎంజీకేఎల్ఐ, మినీ లిఫ్ట్లతో సాగునీరు పుష్కలమైంది. దీంతో మెట్ట భూముల్లో సైతం సాగునీరు పారించి నీళ్ల నిరంజన్గా పేరొందారు. పల్లెనిద్ర, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు.. ఇలా నిత్యం మమేకమవుతుండడంతో జనాదరణ పెరిగింది. సీఎం కేసీఆర్పై ప్రేమ.. జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు బీఆర్ఎస్కు జై కొడుతుండగా.. ఈ సారి కారు గెలుపు లాంఛనమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వనపర్తి అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : గడిచిన తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలంతా బీఆర్ఎస్వైపు నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ పాలనను గమనించిన ప్రజలు తక్కువ కాలంలో చేపట్టిన అభివృద్ధిని చూసి గులాబీ పార్టీకి అండగా నిలబడుతున్నారు. గతంలో వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు పంట చేతికిరాక అనేక మంది వలసలు వెళ్లేవారు. నేడు మంత్రి నిరంజన్రెడ్డి కృషితో సాగునీరు నియోజకవర్గంలో పరుగులు పెడుతున్నది. అంతేకాకుండా వనపర్తి ని యోజకవర్గంలో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను చకచకా పరిష్కరించి ఊహించని అభివృద్ధి చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే 52వేల భారీ ఓట్ల మెజార్టీ కట్టబెట్టి కాం గ్రెస్, టీడీపీలను ఖంగుతినిపించారు. ఈసారి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వనపర్తి జిల్లా ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కలిసొచ్చింది. వనపర్తి, గోపాల్పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం, రేవల్లి, వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబాయి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా వనపర్తి జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం. ఈ క్రమంలో ఎంజీకేఎల్ఐతోపాటు బీమా ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగునీరందించే చర్యలు పట్టుదలగా చేపట్టారు. దీంతో నేడు జిల్లాలో ఎక్కడ చూసినా సాగుబడులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తొమ్మిదేండ్లలో సాగునీటిపరంగా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. గతంలో ఒక్క జూరాల ప్రాజెక్టు ద్వారా మాత్రమే జిల్లాలోని కొంత భాగానికి సాగునీరందించే వెసలుబాటు ఉన్నది. ఇప్పుడా పరిస్థితుల నుంచి జిల్లా పూర్తిగా గట్టెక్కింది. జూరాలకు మించి నేడు ఇతర ప్రాంతాలు సాగునీటికి నోచుకునే విధంగా వసతులు సమకూర్చడంతో ఊహించని మార్పులకు వనపర్తి వేదికైంది. రాష్ట్రంలోనే యాసంగిలో వేరుశనగ పంటల సాగులో ప్రథమ స్థానంలో నిలిచే స్థాయికి జిల్లా చేరుకున్నదంటే ఎంతటి మార్పులు వచ్చాయో ఇట్టే తెలిసిపోతుంది. 14మండలాల్లో
జిల్లా పరిధిలో ఉన్న 14మండలాల్లో నేడు పంటల సిరి కనిపిస్తున్నది. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతున్నది. వీటిలో ఒక్కొక్క మండలానికి రెండు ప్రాజెక్టుల నీటి వసతులు కూడా ఏర్పాటయ్యాయి. వనపర్తి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏమాత్రం ప్రాజెక్టుల సాగుబడులు లేవు. ఒక్క పెబ్బేరు మండలంలో కొంత భాగం జూరాల కాల్వ ద్వారా నీటి వసతి మినహా మిగితా ప్రాంతమంతా సాగునీటి వసతులు లేవు. ఐదేండ్లలో మిగిలిన మండలాలకు ఎంజీకేఎల్ఐ ద్వారా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. మరికొన్ని మండలాలకు బీమా ప్రాజెక్టు ద్వారా సాగుబడులకు నీరొచ్చేలా చేశారు. అలాగే జిల్లా పరిధిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చొరవతో ప్రాజెక్టుల నీటి వసతులు సమకూర్చబడ్డాయి. కొత్తకోట, మదనాపురానికి బీమా, ఎంజీకేఎల్ఐ సాగునీటిని అందించడంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సఫలీకృతమయ్యారు. మక్తల్ పరిధిలోని రెండు మండలాలకు జూరాల ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కృషితో సాగునీరందుతున్నది. సాగునీటి వసతులు సమకూర్చుకున్న వనపర్తి జిల్లా నెంబర్వన్గా నిలుస్తున్నది.
వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా జి.చిన్నారెడ్డి కొనసాగారు. నాలుగు పర్యాయాలు చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. టీడీపీ హయాంలో రెండు పర్యాయాలు రావుల చంద్రశేఖర్రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటు తర్వాత ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఓటమి చెందారు. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్య భూమిక పోషించడం వల్ల సీఎం కేసీఆర్ గుర్తించి అప్పట్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 50వేల పైచిలుకు మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు సాగునీటి పరంగా, అటు విద్యాపరంగా బంగారు భవిష్యత్కు బాటలు వేశారు.