Nagam Janardhan Reddy | మహబూబ్నగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) అతనో మాజీ మంత్రి.. అందునా వైద్యుడు.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంత్రి పదవులు అనుభవించిన దిట్ట. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారీ అక్రమాలకు పాల్పడడంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అతడిని బియ్యంరెడ్డిగా అసెంబ్లీలో ప్రస్తావించి సంచలనం సృష్టించాడు. అయితే, ఇప్పుడు జనం నాడి దొరకక విలవిలలాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు 2011లో టీడీపీతో విబేధించి రాజీనామా డ్రామాకు తెరలేపాడు. ఉద్యమాన్ని సపోర్ట్ చేయకపోవడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అతడికి తగిన బుద్ధి చెప్పారు.
దీంతో జ్ఞానోదయమై సొంత పార్టీ పెట్టినా.. అది మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. రాష్ట్ర రాజకీయాలు వద్దనుకుని.. జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న కలతో బీజేపీలో చేరాడు. 2014లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిపోదామనుకున్నాడు. కానీ, ప్రజలు తిరస్కరించడంతో డిపాజిట్ మాత్రమే దక్కింది. ఆ పార్టీ నేతలను కాదని సొంత ఎజెండా అమలు చేయాలని భావించడంతో కమలం నేతలు పొమ్మనలేక పొగబెట్టారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చినా.. చివరికి అదే పార్టీ దిక్కైంది. మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కందనూలులో కాంగ్రెస్కు చెందిన మరో నేత నాగం రాకను తీవ్రంగా వ్యతిరేకించి కారెక్కాడు. ఎమ్మెల్సీ స్థానాన్ని పదిలపర్చుకున్నాడు.
ఇంత వెలుగువెలిగిన నాగంకు సొంత ఇంట్లో, నియోజకవర్గంలో రాజకీయ వారసులు లేక ఆగం ఆగం అవుతున్నాడు. చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న చిట్కా వైద్యానికి జనం స్పందించకపోవడంతో 2018లో ఘోర పరాజయం పొందాడు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కందనూలు జిల్లా కేంద్రమైంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి రూ.వందల కోట్లు తీసుకొచ్చి చేపడుతున్న అభివృద్ధి, సొంత ట్రస్ట్ ద్వారా సేవా కార్యాక్రమాలు ప్రజలకు చేరువచేస్తున్నాయి. మర్రి రాజకీయ చతురత ఎదుట నాగం రాజకీయ జీవితాన్ని కోమాలో పడేశాయి. బీఆర్ఎస్ను ఢీకొట్టాలని వేస్తున్న ప్లాన్లు అట్టర్ఫ్లాప్ అవుతుండడంతో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తన వద్దే ఓనమాలు నేర్చుకున్న పార్టీ చీఫ్తో జత కట్టాల్సి రావడంతో లోలోపల మదన పడుతున్నాడట. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆయన దుకాణం ఎత్తేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది.
నాగర్కర్నూల్లో వైద్యుడిగా పేరొందిన నాగం జనార్దన్రెడ్డి.. దివంగత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక రాజకీయాల్లోకి ప్రవేశించాడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాజకీయం మొదలుపెట్టిన ఆయన ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో జతకట్టి మంత్రి పదవులు పొందాడు. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో బాబునే విమర్శించి.. 2011లో టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యాడు. తెలంగాణపై నటన స్టార్ట్ చేశాడు. తెలంగాణ నగారా పేరిట సొంత పార్టీ పెట్టి.. రాష్ట్రమంతా పర్యటించి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చేపట్టిన బస్సుయాత్ర తుస్సుమంది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేశాడు. పాలమూరు ప్రజలు ఘోరంగా ఓడించడంతో ఆ పార్టీలో దుకాణం బంద్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి.. చివరికి అదే పార్టీలో గత్యంతరం లేక చేరాల్సి వచ్చింది. దీంతో నాగం బద్ధశత్రువు అయిన కూచకుళ్ల దామోదర్రెడ్డి ఆయన రాకను వ్యతిరేకించి గులాబీ పార్టీలో చేరారు. నాగం జనార్దన్రెడ్డి 2018లో నాగర్కర్నూల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. బీఆర్ఎస్ను ఢీకొనలేక డ్రామాలకు తెరలేపినా.. కందనూలు జనం నమ్మే స్థితిలో లేరని తేలిపోయింది.
మూడు దశాబ్దాలపాటు రాజకీయ జీవితం అనుభవించిన నాగంకు ఇంకా అధికార దాహం తీరడం లేదు. మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గాన్ని విస్మరించిన ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతూనే ఉన్నా.. తాజాగా ఇవే చివరి ఎన్నికలంటూ కొత్త డ్రామాలకు తెరలేపాడు. కందనూలును శాసించిన రోజుల్లో ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీయకుండా.. ఇతర పార్టీ నేతలను ఇబ్బందిపెట్టి పబ్బం గడిపాడు. తెలంగాణ వచ్చాక పొలిటికల్ ప్రాక్టీస్ లేక ఆయన దుకాణం వెలవెలబోయింది. సొంత ఇంట్లో కూడా వారసులు లేకపోవడంతో రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక త్వరలో వచ్చే ఎన్నికలే చివరివంటూ కొత్త ప్రిస్క్రిప్షన్ రాసుకుంటున్నాడు. అయినా, జనం నమ్మేస్థితిలో లేరని తెలియడంతో లోలోపల మదన పడుతున్నాడట. ఈ ఎన్నికల్లో కూడా మర్రిని ఢీకొనలేక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కారెక్కుతున్నారు. సొంతపార్టీ నేతలను కూడా పట్టించుకోకపోవడంతో నేతలు జారుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి కొడుకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. ఇక నాగం భవిష్యత్ ప్రశ్నార్థకం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారం అందని ద్రాక్షే అయిందని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు.