పెద్దకొత్తపల్లి, జూలై 21 : ఓ చెయ్యితో ఇచ్చి మరో చెయ్యితో లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. గత యాసంగి, వానకాలం రైతు భరోసాకు ఎగనామం పెట్టి, ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా డబ్బులను కూడా రైతులు తీసుకున్న పంట రుణాల అప్పుకింద బ్యాంకులు జమ చేసుకుంటుండడంతో రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో కోడెటి బాలపీరు రూ.80వేలు పంట రుణం తీసుకుంటే రైతు భరోసాకు చెందిన రూ.21 వేలలో రూ.13వేలను అప్పుకింద జమ చేసినట్లు పేర్కొన్నారు.
సాతాని మశన్న పంట రుణం రూ.లక్ష తీసుకున్నాడు. వడ్డీ కట్టాలని రైతు భరోసా డబ్బులను ఇవ్వడం లేదని బాధిత రైతు వాపోతున్నారు. రాష్ట్రంలో వందశాతం రుణామాఫీ జరిగినట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది కానీ సీఎం సొంత జిల్లాలోనే రుణామాఫీ కానీ రైతులతో గత రెండున్నర యేండ్ల కింద పంట రుణాలను తీసుకున్న రైతుల మెడపై కత్తి పెట్టి బ్యాంకర్లు అప్పు వసూళ్లు చేస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కరువు కాలంలో ఆరుతడి పంటలు వేసుకొని జీవిస్తామని అనుకున్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా పేరుతో డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ లాక్కొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట క్రాప్ లోనుకు సంబంధించిన బకాయిలకు ముడిపెట్టకుండా ప్రభుత్వం జమ చేసిన రైతు భరోసా డబ్బులను రైతులకు నేరుగా ఇవ్వాలని రైతులు బ్యాంకు మేనేజర్ను డిమాండ్ చేస్తున్నారు.
బ్యాంక్లో పంట పెట్టుబడి కోసం రూ.80వేలు లోన్ తీసుకున్నాను. గత రెండున్నర ఏండ్లు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేదు. దీంతో తీసుకున్న పంట రుణానికి రెన్యూవల్ చేయలేక పోయాను. ఇప్పు డు రైతు భరోసా డబ్బులను మా అనుమతి లేకుండా రూ.21వేలలో రూ. 13వేలను అప్పు కింద జమ చేశారు. ఇప్పుడు పెట్టుబడి సహా యం కోసం ఎక్కడి పోవాలో అర్థం కావడం లేదు.
– కోడెటి బాలపీరు, రైతు, పెద్దకార్పాముల