వనపర్తి,మే 14(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. పక్షంరోజులుగా మార్కెట్ యార్డుల్లో మగ్గుతున్నా వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. గురువారం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొ నడం లేదని ఖిల్లాఘణపురం-మహబూబ్నగర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న వనపర్తి తాసీల్దార్ రమేశ్రెడ్డి, పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. పదేళ్ల నుంచి వడ్ల కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నదే.
ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి చేస్తున్నదేమి లేదు. తాలు లేకుండా శుభ్రంగా ధాన్యం తూర్పు పట్టినా తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మిల్లర్లకు ఇంటర్నేషనల్ నిబంధనలు ఏమైనా పెట్టారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ప్రభుత్వం కొంటుం దా.. మిల్లర్లు ధాన్యం కొంటున్నారా అన్న ట్లు గందరగోళం ఉందంటూ ఆందోళన చేపట్టిన పలువురు అన్నదాతలు తాసీల్దార్ను ప్రశ్నించారు.
అధికారులు వెంట పోలీసులను తీసుకొస్తారని, మా సమస్య చెప్పాలన్న కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ హయాంలో ఇలా రైతులను ఎందుకు దిగజార్చుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఎప్పుడు లేనంతంగా నష్టాలను రైతులకు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఎవరూ నిలబడటం లేదని, అధికారులు రావడం, ఏదో ఒకటి చెప్పి వెళ్లడం తప్పా ఏ ఒక్క మిల్లు యజమాని అధికారుల మాటను లెక్కచేయడం లేదని రైతులు బావురుమన్నారు. తాసీల్దార్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు రోడ్డుపై ఆందోళన విరమించారు. కాగా, మార్కెట్ యార్డులో నెలరోజుల నుంచి ధాన్యం నిల్వలున్నాయి. కొనుగోలు ఏ మాత్రం సవ్యంగా సాగడం లేదు.