గద్వాల, మార్చి 27 : కృష్ణానది జలాలతో గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూములకు సాగునీటిని అందించే గట్టు ఎత్తి పోతల పథకం పనులు చూసి నత్త కూడా నవ్వుతోంది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం త్వరలో కార్యరూపం దాల్చుతుందన్న గట్టు, కేటీదొడ్డి రైతుల ఆశలు అడి ఆశలుగా మారుతున్నాయి. గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి నెట్టెంపాడు ద్వారా సాగునీటికి నోచుకోని ప్రాంతాలైన గట్టు, ఆలూరు, తుమ్మలచెర్వు, రాయపురం, జోగన్గట్టు, మల్లాపురం, మల్లాపురంతండా, కుచినెర్ల, చింతలకుంట, తారపురం, సోంపురం, మాచర్ల, ఎల్లందొడ్డి తదితర గ్రామాలతోపాటు కేటీదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండడంతో మరో రెండు సంవత్సరాలైనా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. తుమ్మలచెర్వు సమీపంలో ర్యాలం పాడు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొని గట్టు మండలం రాయపురం సమీపంలో గజ్జలమ్మ గట్టు వద్ద 1.320 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి దీని ద్వారా గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతోపాటు ఈ మండలాల్లో 44 చెరువులతోపాటు కుంటలను నీటితో నింపి డిస్ట్రిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీటిని అందించడానికి దీనిని నిర్మించారు. నెట్టెంపాడు ద్వారా నీరు అందని గట్టు, కేటీదొడ్డిలోని అన్ని గ్రామాలకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పడకేసేలా చేసింది.
ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసే పంప్హౌస్కు నీటిని పంపిస్తారు. పంప్హౌస్ నుంచి 12మెగావాట్ల(ఎండబ్ల్యూ) సామర్థ్యం కలిగిన రెండు మోటర్ల ద్వారా మూడు మీటర్ల వ్యాసం కలిగిన పైప్లైన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని గజ్జలమ్మ గట్టు రిజర్యాయర్లోకి నీటిని తోడిపోస్తారు. 50రోజులపాటు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు ఎత్తిపోతల పథకానికి నీటిని ఎత్తిపోయనున్నారు. రిజర్వాయర్ దగ్గర నుంచి ఏర్పాటు చేసే కుడి కాల్వను 18కి.మీ., ఎడమ కాల్వ 15కి.మీ పొడవున తవ్వి నీటిని కాల్వల ద్వారా తరలించి 33వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు ఆయా మండలాల్లో ఉన్న 44 చెరువులు నింపనున్నారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా గట్టు ఎత్తి పోతల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.586 కోట్లతో గట్టు ఎత్తిపోతల పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ప్రభావం గట్టు ఎత్తిపోతల పనులపై పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయడంలో జాప్యం జరుగుతుండడంతో పనులు అనుకున్న స్థాయిలో ముందుకుసాగడం లేదు. వాస్తవంగా పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండు ఏండ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలనేది ఒప్పందం. అయితే పనులు ప్రారంభమై ఇప్పటికే ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో కేవలం 40శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అక్టోబర్ నెల నుంచి పనులు ఓ మాదిరిగా సాగుతున్నాయి. ప్రస్తుతం వాహనాలకు డీజిల్ పోయించడానికి నిధులు లేక పోవడంతో పనుల దగ్గర వాహనాలు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు నిలిపి వేశారు. అయితే పనులు ఆగిపోయాయనే అపవాదు రాకుండా కొద్దిపాటి వాహనాలతో ప్రాజెక్టుకు అవసరమైన మట్టిని తరలించడం, ఆ మట్టిని చదును చేసే పనులు చేస్తున్నారు. కట్టకు సంబంధించి రివిట్మెంట్ కొంతదూరం చేసి పనులు నిలుపుదల చేశారు. గట్టు ఎత్తిపోతల పనులు నిదానంగా జరగడానికి గల కారణాలు ఆరా తీస్తే రూ.85 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని డీజిల్ కోసం కూడా అప్పు చేసే పరిస్థితి ఉండడంతో కొన్ని వాహనాలతో మాత్రమే పని చేయిస్తున్నట్లు తెలిసింది. బిల్లులు జాప్యం లేకుండా చెల్లిస్తే పనులు వేగవంతం చేసి మరో ఏడాదిలో పనులు పూర్తి చేసే విధంగా ముందుకు సాగే అవకాశం ఉంది.