జడ్చర్లటౌన్, నవంబర్ 7 : 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో నాయీబ్రహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కనీసం తాగునీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మలు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కరెంటు, నీళ్ల కోసం కష్టాలు పడేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు మేలు చేయాలనే సోయి ఉండదని చెప్పారు. దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటాలకు మోసపోవద్దని, ప్రజలకు మేలు చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. సీఎం సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బాగుపడుతున్నారని చెప్పారు. నాయీబ్రహ్మణులకు ఉచిత కరెంటుతో పాటు అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. నీరుపేద నాయీబ్రహ్మణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. నాయీబ్రహ్మణుల కోసం హైద్రాబాద్లో రూ.వంద కోట్లు నిధులతో భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు కోసం మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు నిలవాలని కోరారు.
గత పాలకులు గౌడ కుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మా బతుకులు బాగుపడ్డాయని.. గీత కార్మికులకు బీమా సదుపాయంతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని గౌడ సంఘం నాయకులు ప్రతిజ్ఞ చేశారు. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గంలోని బాలానగర్, మిడ్జిల్, రాజాపూర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బాలానగర్ మండలం వాయలకుంట తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. అలాగే మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన వారుసభ్యురాలు జంగమ్మ, యూత్కాంగ్రెస్ నాయకుడు కేశవులుతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.