దేశం మొత్తాన్ని ఏకం చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్ జోడో యాత్ర ‘హస్త’వ్యస్తంగా మారింది. తమకు ప్రాధాన్యం దక్కలేదని కాంగ్రెస్ నేతలునైరాశ్యంలో ఉండగా.. జన సమీకరణలో నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత జిల్లాలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ పరువు పోయిందని అదే పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడికి చురకలు అంటించినట్లు సమాచారం. యాత్రకు స్పందన రాకపోవడమేమిటని ప్రశ్నించింది. కాగా కుటుంబసమేతంగా రాహుల్తో ఫొటో దిగేందుకు ‘పేట’ పార్టీ అధ్యక్షుడు శ్రీహరి యత్నించగా భద్రతా సిబ్బంది తోసేసినట్లు స్వయగా బాధపడ్డాడట. కార్యకర్తల ముందే పరువుపోయిందని తెగ మదనపడ్డాడట. దేవరకద్రలో పోటాపోటీగాఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. అంతర్గత విభేదాలు పొడచూపాయి. తనను తోసేయడంతో చేతికి వాపొచ్చిందని మరో జిల్లా అధ్యక్షుడు వాపోయాడు. కార్యకర్తల ముందు బిల్డప్లు కొట్టిన నేతలంతా నేడు
ముఖం చాటేస్తున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సోనియాగాంధీ తనయుడు రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో జనాదరణ కరువైంది. ఈ రెండు జిల్లాల్లో యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ అధిష్టానం, ఇన్చార్జిలు పోస్టుమార్టం మొదలుపెట్టారు. జనసమీకరణలో నేతలు విఫలమయ్యారని అధిష్టానం సీరియస్గా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గరంగరమయ్యారని తెలిసింది. పార్టీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూరు, యాత్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ రేవంత్ను కడిగిపారేశారట. సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో రేవంత్ అలిగి వెళ్లిపోయారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన యాత్రలో ఆయన అస్సలు లేనేలేడు. రేవంత్ సొంత జిల్లాలో యాత్రకు స్పందన రాకపోవడమేమిటని ప్రశ్నించింది. విరామం తర్వాత రాహుల్ యాత్ర నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమైతే కేవలం పోలీసులు, మీడియా మాత్రమే వెంట ఉండడంతో రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైనా ఒక్క కార్యకర్త కనిపించలేదు. దీంతో ముఖ్య నాయకులు ఖంగుతిన్నారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై యాత్ర ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. పరుష పదజాలంతో దూషించారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీహరికి కూడా తీవ్ర అవమానం జరిగింది.
మక్తల్లో కుటుంబసమేతంగా రాహుల్తో ఫొటో దిగాలని యత్నించగా.. భద్రతా సిబ్బంది తోసేశారు. కార్యకర్తల ముందు తనను అవమానించడంతో యాత్రలో ఆయన కనుమరుగయ్యారు. నారాయణపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవరకద్రలో యాత్ర ఎంటరైతే అక్కడున్న నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే మిగిలారు. పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టడంతో ఒకరి బ్యానర్లు మరొకరు చించేశారు. జీఎంఆర్, ప్రశాంత్రెడ్డి, ప్రదీప్గౌడ్ వేర్వేరుగా స్వాగత స్టేజీలు కట్టారు. దేశాన్ని ఏకం చేసేందుకు యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం విడిపోయి జనాల్లో పరువు తీస్తున్నారని అధిష్టానం గుర్రుమంది. తననే తోసేశారని.. ఇంకా చేయి వాపు తగ్గలేదని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మీడియా ముందు వాపోయాడు. ఎంతో మంది నాయకులను, యాత్రలను చూశాను.. కానీ ఇలాంటి యాత్ర జీవితంలో చూడలేదు. అంటూ అసహనం వ్యక్తం చేశారు. జడ్చర్లలో ఇటీవల పార్టీలో చేరిన ఎర్రశేఖర్ను పక్కకు పెట్టడం చర్చనీయాంశమైంది. హైవేపై ప్రయాణికుల కష్టాలను పట్టించుకోకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్తో పరుగు పందెం ఆడటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సామాన్యులను వద్దకు రానివ్వని రాహుల్ సెలబ్రిటీలను పక్కన పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతో చాలామంది నారాజ్ అయ్యారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో మహబూబ్నగర్ ఆటో యూనియన్ నాయకుడు రాములు పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు. మేమంతా రాహుల్ను కలవడానికి వస్తే ఎందుకు అనుమతివ్వలేదని.. అందరి ముందు తోస్తే కింద పడ్డామని మండిపడ్డారు. పార్టీలో ఉండి ఏం లాభమని అసహనం వ్యక్తం చేశారు.
చెయ్యికి తగిలిన దెబ్బను చూపిస్తున్న ఒబేదుల్లా కొత్వాల్
పాదయాత్రనా? పరుగు పందెమా..?
జోడో యాత్ర పరుగు పందాన్ని తలపించింది. నిత్యం ఉదయం, సాయంత్రం 25 నుంచి 27 కి లోమీటర్లు యాత్ర చేస్తుండటంతో రాహుల్ వెంట నాయకులు నడవలేక పాట్లు పడ్డారు. వీరితోపాటు 150 మంది పోలీసులు పడ్డ కష్టాలు అంతా ఇంతా కావు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్షయ్యకు తోపులాటలో చేతి మణికట్టు విరిగింది. దీంతో యా త్రకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన బెడ్రెస్ట్ తీసుకున్నారు. ఎందరో కార్యకర్తలు గాయపడ్డారు. పార్టీ నేతలను, కలవడానికి వచ్చిన కార్యకర్తలనే తోసేయడంతో స్థానిక నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎవరినీ క లవకుండా.. పలకరించకుండాపోతే యాత్రకు అ ర్థం ఏముంటుందని నిలదీసినట్లు తెలిసింది. రా హుల్ కోసం పోటీపడి లక్షలకు లక్షల రూపాయ లు ఖర్చుపెట్టి స్వాగతం పలికేందుకు సిద్ధమైతే ఎవరినీ కలవకుండా వెళ్లడంతో పార్టీశ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కార్యకర్తల ముందు బిల్డప్లు కొట్టిన నేతలంతా ముఖం చాటేస్తున్నారు. దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో నేతలకంతా రాహుల్ పాదయాత్ర ఓ పీడకలగా మారింది. ఇదేం పార్టీరా బాబు అంటూ లోలోపలే మదనపడుతున్నారు.