గద్వాలటౌన్, జూన్ 7 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్ నిర్వహణ అనంతరం మృతిచెందిన ఎర్రవల్లి గ్రామానికి చెందిన మైనర్ ఇందు మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, మద్దతుదారులు శనివారం చేపట్టిన ఆందోళన ఆదివారం కూడా కొనసాగింది. మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు, బాలిక మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మూడుగంటలపాటు బాలిక కుటుంబ సభ్యులు ఎండలోనే న్యాయం కోసం పోరాటం చేశారు.
వారికి మద్దతుగా గ్రామస్తులు, బీఆర్ఎస్, సీపీఐ పార్టీల నాయకులతో పాటు వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. ఆర్టీవో శ్రీనివాస్, అదనపు ఎస్పీ శంకర్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్, దవాఖాన సూపరింటెండెంట్ ఇందిరలు ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, వైద్యులు నిర్లక్ష్యమే బాలిక మృతికి కారణమని తేలితే తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాని కుటుంబసభ్యులు వినలేదు. తమ బిడ్డకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కుటంబ సభ్యులు ఎర్రటి ఎండలో పడుకొని పోలీసులు, అధికారులను తమకు న్యాయం చేయాలని వేడుకోవడం అందరిని కలచివేసింది.
బాలిక ఇందు మృతి చెందలేదని వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించి హత్య చేశారని బీఆర్ఎస్, సీపీఐ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, కుర్వపల్లయ్య ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానకు రావాలంటేనే ప్రజలకు భయం వేస్తుందని విమర్శించారు. మృతిచెందిన బా లిక పోస్టుమార్టం, డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బాలిక మృతిచెందిన వెంటనే వారి సొంత గ్రామానికి హుటాహుటిన ఎందుకు తరలించాల్సి వచ్చిందని నిలదీశారు. ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్య వైఖరి కారణంగా బాలిక మృతి చెందిందని కారుకులపై విచారణ చేపట్టి సస్పెండ్ చేస్తూ వారి పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు జాంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, రాజు, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.
బాలిక మృతిపై చేపట్టిన అందోళన తీవ్రతరం కాకుండా అదనపు కలెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, అలంపూర్ సీఐ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఆందోళనను విరమించాలని నచ్చజెప్పినా ఆం దోళనకారులు వినకపోవడంతో బలవంతంగా పోలీసుల వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. న్యాయం చేయాలని కోరడం తప్పా అన్ని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. తమకు మద్దతుగా నిలిచిన వారిని అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని పోలీసులను నిలిదీశారు. కాగా బాలిక మృతికి కారణాలపై ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబంలో ఒకరికి మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యో గం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమింప చేసినట్లు తెలిసింది.
దవాఖానలో బాలిక మృతిపై కలెక్టర్ రిజ్వాన్బాషా స్పందిస్తూ బాలిక మృతి కారణాలు తెలుసుకునేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన స్వత్రంత ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బాలికకు అందించిన చికిత్స, వ్యాధి తీవ్ర త, సంబంధిత పరీక్షలు, శస్త్ర చికిత్సపై కమిటీ పూర్తి విచారణ చేపట్టనుంది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. నివేదికలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేలితే తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు.